Satwik Sairaj: ఆసియా క్రీడల బ్యాడ్మింటన్ లో స్వర్ణంతో చరిత్ర సృష్టించిన సాత్విక్, చిరాగ్ జోడీ

  • చైనాలోని హాంగ్ ఝౌలో ఆసియా క్రీడలు
  • నేడు పురుషుల బ్యాడ్మింటన్ డబుల్స్ ఫైనల్
  • వరుస గేముల్లో కొరియా జోడీని ఓడించిన సాత్విక్, చిరాగ్
  • ఆసియా క్రీడల బ్యాడ్మింటన్ చరిత్రలో భారత్ కు ఇదే తొలి స్వర్ణం
Satwik and Chirag creates history by wiinning first ever badminton gold for Indian in Asian Games

తెలుగుతేజం సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడీ ఆసియా క్రీడల బ్యాడ్మింటన్ లో చరిత్ర సృష్టించింది. చైనాలోని హాంగ్ ఝౌలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో సాత్విక్, చిరాగ్ ద్వయం పురుషుల డబుల్స్ ఈవెంట్ లో స్వర్ణం చేజిక్కించుకుంది. ఇవాళ జరిగిన ఫైనల్లో సాత్విక్-చిరాగ్ 21-18, 21-16తో దక్షిణ కొరియాకు చెందిన చోయి సోల్గ్యూ, కిమ్ వోన్హో జోడీపై నెగ్గారు. 

తొలి గేమ్ లో భారత జోడీ పలుమార్లు వెనుకబడినప్పటికీ అద్భుతంగా పుంజుకుని ఆ గేమ్ ను కైవసం చేసుకుంది. ఇక రెండో గేమ్ లో భారత షట్లర్లకు ఎదురులేకుండా పోయింది. రెండో గేమ్ ఆరంభం నుంచే కొరియన్లపై ఒత్తిడి పెంచారు. మొత్తమ్మీద 57 నిమిషాల్లో మ్యాచ్ ను ముగించి భారత్ ఖాతాలో పసిడి పతకం చేర్చారు. ఆసియా క్రీడల బ్యాడ్మింటన్ చరిత్రలో భారత్ కు ఇదే తొలి స్వర్ణం. దాంతో సాత్విక్, చిరాగ్ జోడీ విజయానికి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. 

1982 ఆసియా క్రీడల్లో లెరాయ్ డిసా, ప్రదీప్ గాంధే జోడీ కాంస్యం గెలిచాక మళ్లీ ఇన్నాళ్లకు ఆసియా క్రీడల బ్యాడ్మింటన్ డబుల్స్ లో భారత్ ఓ పతకం సాధించింది.

More Telugu News