చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ వ్యక్తి ఆత్మహత్యాయత్నం

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టు నిరసిస్తూ హైదరాబాద్ లోని సనత్ నగర్ లో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. చంద్రబాబును ఏపీ ప్రభుత్వం ఇటీవల అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు అరెస్ట్ అక్రమమని, ఆయనను వెంటనే విడుదల చేయాలని టీడీపీ కార్యకర్తలు, నేతలతో పాటు సామాన్యులు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ తో పాటు దేశవిదేశాల్లో నిరసనలు, ర్యాలీలు చేస్తున్నారు. హైదరాబాద్ లోనూ పలు చోట్ల నిరసన దీక్షలు జరుగుతున్నాయి.

ఈ క్రమంలోనే సనత్ నగర్ డివిజన్ లోని జెక్ కాలనీలో టీడీపీ కార్యకర్తలు దీక్షా శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో స్థానిక నేతలు, కార్యకర్తలు నిరాహార దీక్ష చేపట్టారు. తాజాగా శనివారం ఉదయం దీక్షా శిబిరం వద్ద శ్రీనివాస్ అనే వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించడం సనత్ నగర్ లో కలకలం రేపింది. ఒంటిపై పెట్రోల్ పోసుకున్న శ్రీనివాస్ ను అక్కడున్న పార్టీ నేతలు వారించారు. శ్రీనివాస్ ను అడ్డుకుని అతడిపై నీళ్లు కుమ్మరించారు. దీంతో ప్రమాదం తప్పింది.


More Telugu News