లోకేశ్ పాదయాత్రకు, పవన్ వారాహి యాత్రకు అడ్డంకులు సృష్టిస్తున్నారు: గంటా శ్రీనివాసరావు

ఏపీకి మళ్లీ చంద్రబాబే ముఖ్యమంత్రి అవుతారని టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్ ను నిరసిస్తూ దేశ, విదేశాల్లో ప్రజలు బయటకు వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న ముఖ్యమంత్రి జగన్... చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేయించడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. కేసుల నుంచి చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని చెప్పారు. లోకేశ్ పాదయాత్రకు, పవన్ కల్యాణ్ వారాహి యాత్రకు ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని మండిపడ్డారు. 

విశాఖ నుంచి ప్రముఖ సంస్థ లులూను ఏపీ ప్రభుత్వం తరిమేసిందని గంటా శ్రీనివాసరావు విమర్శించారు. ఇక్కడి నుంచి తరిమేస్తే... తెలంగాణ ప్రభుత్వం సాదరంగా ఆహ్వానం పలికిందని చెప్పారు. ఏపీలో స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజంతో విసిగిపోయిన లులూ సంస్థ... ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టబోమని స్పష్టం చేసిందని తెలిపారు. జగన్ తన రివర్స్ పాలనతో లులూను పంపించేసి, 5 వేల మంది యువతకు ఉపాధిని దూరం చేశారని విమర్శించారు. 


More Telugu News