New Jersey: అమెరికాలో భారత సంతతి కుటుంబం అనుమానాస్పద మృతి

  • న్యూజెర్సీలోని ప్లెయిన్స్‌బొరో ప్రాంతంలో బుధవారం వెలుగులోకొచ్చిన ఘటన 
  • పోలీసులు వెళ్లి చూడగా ఇంట్లో విగతజీవులుగా కనిపించిన భారతీయ జంట, వారి సంతానం
  • భర్త తొలుత భార్యాపిల్లలను చంపి ఆపై ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసుల అనుమానం
Indian family found dead in New jersey police suspect murder suicide

అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలో ఓ భారత సంతతి కుటుంబం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ప్లెయిన్స్‌బొరో ప్రాంతంలో బుధవారం ఈ ఘటన వెలుగు చూసింది. స్థానికంగా నివసించే తేజ్ ప్రతాప్ సింగ్ (43), ఆయన భార్య సోనాల్ పరీహార్ (42), వారి పదేళ్ల కుమారుడు, ఆరేళ్ల కుమార్తె అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. వారు ఎలా ఉన్నారో ఒకసారి వెళ్లి చూడండంటూ ఇరుగుపొరుగు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ప్రతాప్ సింగ్ ఇంటికి చేరుకోగా ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. 

ప్రతాప్ సింగ్ తొలుత ఇంట్లో వారిని చంపి ఆపై తాను ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని అక్కడి పోలీసులు భావిస్తున్నట్టు స్థానిక మీడియా పేర్కొంది. ఈ ఘటనలో ఎలాంటి కాల్పులు చోటుచేసుకోలేదని స్థానిక పోలీసులు స్పష్టం చేశారు. భార్యాభర్తల్లో ఒకరు ఐటీ రంగంలో మరొకరు మానవవనరుల విభాగంలో పనిచేస్తున్నట్టు స్థానికులు చెబుతున్నారు. వారి కుటుంబం సంతోషంగానే కనిపించేదని, ఇంతటి ఘోరం జరుగుతుందని తాము అనుకోలేదని మృతుల బంధువులు తెలిపారు.

More Telugu News