Jogi Ramesh: పెడన సభ ఫెయిలైంది.. పవన్ కల్యాణ్‌తో ఆ పేరుతో సినిమాలు తీస్తా!: జోగి రమేశ్

  • పెడనలో తనపై రాళ్ళ దాడి జరగబోతుందని పవన్ సినిమా డైలాగ్‌లు కొట్టారని విమర్శ
  • కానీ తీరా చూస్తే సభ ఫెయిలైందన్న మంత్రి
  • పెడన ప్రజలను రౌడీలు అన్నారని, అందుకు పవన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్
  • అత్తారింటికి దారేది సినిమా ఎక్కడో పైరసీ జరిగితే పెడన వారిని కొట్టించారని ఆరోపణ
  • చంద్రబాబు పాలన అవినీతిమయమని పవన్ గతంలో చెప్పారన్న మంత్రి
  • జగన్ పేదల వైపు ఉంటే, పవన్ పెత్తందారీల వైపు ఉన్నారని వ్యాఖ్య
Jogi Ramesh lashes out at pawan kalyan

పెడనలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సభ అట్టర్ ఫ్లాప్ అయిందని మంత్రి జోగి రమేశ్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... పెడనలో అటెన్షన్ ప్లే చేయాలని పవన్ చూశారని, అందుకోసం ప్రయత్నాలు చేశారని, కానీ అది కుదరలేదన్నారు. సినిమా స్టైల్లో తనపై రాళ్ల దాడి జరగబోతుందంటూ డైలాగ్‌లు వదిలారని, తీరా చూస్తే సభనే విఫలమైందన్నారు. టీడీపీ, జనసేన కలిసి కూడా కనీసం రెండువేల మంది జనాన్ని సమీకరించలేకపోయారన్నారు.

పెడన ప్రజలపై పవన్ అనుచిత వ్యాఖ్యలు చేశారని, రౌడీలు అన్నందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీ, జనసేన కలయిక వ్యాక్సీన్ కాదని, అదో వైరస్ అన్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ల కలయిక ప్రజలకు విషంతో సమానమన్నారు. గత ఎన్నికల్లో రెండుచోట్లా ఓడిన పవన్ నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారని, ఆయనకు సిగ్గు, మనస్సాక్షి లేవన్నారు.

పవన్ వెలికి వేషాలు చూసి ప్రజలు కూడా ఓ నిర్ధారణకు వచ్చారని, అత్తారింటికి దారేది సినిమాకు సంబంధించి ఎక్కడో పైరసీ జరిగితే మా పెడన కలంకారీ తమ్ముళ్లను పవన్ కొట్టించారన్నారు. కలంకారీ పరిశ్రమ దేశానికే గర్వకారణమని, తమ ప్రభుత్వం వారిని గౌరవించి, సత్కరించిందని చెప్పారు. అలాంటి వారిని రౌడీలతో పోల్చుతావా? అని పవన్‌పై మండిపడ్డారు.

చంద్రబాబు పాలన అవినీతిమయమని గతంలో పవన్ చెప్పారని గుర్తు చేశారు. 2014లో టీడీపీ చేసిన స్కాంలను చూసి ప్రజలు ఆ పార్టీకి బుద్ధి చెప్పారని, చంద్రబాబు ఇప్పుడు రాజమండ్రి కేంద్రకారాగారంలో కూర్చున్నారన్నారు. పవన్ ముఖ్యమంత్రి కావాలంటే తమ బ్లడ్ ఎక్కించుకోవాలని కొంతమంది చెప్పారని, ఇప్పుడు రాజమండ్రి జైల్లో చంద్రబాబును కలిసి పవన్ ఆ కులం బ్లడ్ ఎక్కించుకున్నారని ఎద్దేవా చేశారు. పవన్‌కు సిగ్గులేనందుకు వారి బ్లడ్ ఎక్కించుకున్నారేమో కానీ కాపు ప్రజలకు దమ్ము, ధైర్యం ఉన్నాయన్నారు. కాపులు పవన్‌లా వ్యవహరించరన్నారు.

వంగవీటి రంగాని చంపిన వారిని పవన్ భుజాన వేసుకొని తిరుగుతున్నారన్నారు. చంద్రబాబు, పవన్, ఎల్లో మీడియా, మరికొందరు బ్రోకర్లు ఏం చేయలేరన్నారు. పవన్ వారాహి మీద నిలబడి మాట్లాడుతుంటే, కొల్లు రవీంద్ర వంటి వారు కింద నిలబడ్డారని, టీడీపీకి ఇదేం ఖర్మ? అన్నారు. జగన్ పేదల పక్షాన ఉంటే, పవన్ పెత్తందారీల పక్షాన ఉన్నారన్నారు.

ఏపీకి రావాలంటే వీసా కావాలేమో అన్న పవన్ వ్యాఖ్యలపై స్పందిస్తూ, రష్యాకు చెందిన వారైతే కచ్చితంగా పాస్ పోర్టు కావాలన్నారు. చంద్రబాబు పని అయిపోయిందని పవన్ చెబుతున్నారని, టీడీపీ వారు ఇకనైనా మైండ్ సెట్ మార్చుకోవాలన్నారు. చంద్రబాబు, పవన్ కలయిక అపవిత్రమైనదన్నారు. వీరి కలయిక వల్ల ప్రజలకు నష్టమే తప్ప లాభం లేదన్నారు. 2024 తర్వాత తాను పవన్‌తో సినిమాలు తీస్తానని చురకలు అంటించారు. జానీ-కూలీ, గబ్బర్ సింగ్ - రబ్బర్ సింగ్ పేరుతో సినిమాలు తీస్తానన్నారు.

More Telugu News