Panchumarthi Anuradha: ఎక్కడా స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ లేదని చెప్పిన జగన్ నేడు అదే సెంటర్‌కు ప్రధాని పేరు ఎలా పెట్టారు?: పంచుమర్తి అనురాధ

  • స్కిల్ కేసులో కోర్టులో మొట్టికాయలు తప్పవని గుర్తించిన జగన్ తుగ్లక్ ఐడియాలకు తెరలేపారని విమర్శ
  • ఆంధ్రా యూనివర్సిటీ స్కిల్ కార్పొరేషన్ బోర్డు తీసేసి ప్రధాని పేరు, ఫోటో పెట్టారని ఆరోపణ
  • చంద్రబాబు మచ్చలేని చంద్రుడిలా బయటకు వస్తాడని జగన్ వణికిపోతున్నారని వ్యాఖ్య
  • జగన్ కేంద్రాన్ని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారన్న పంచుమర్తి
Panchumarthi Anuradha fires at ys jagan government

చంద్రబాబుపై పెట్టిన అక్రమ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో కోర్టుల్లో వైసీపీ ప్రభుత్వానికి మొట్టికాయలు తప్పవని భావించిన సీఎం వైఎస్ జగన్ కొత్త తుగ్లక్ ఐడియాలకు తెరలేపారని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ అన్నారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ... వైజాగ్‌లోని ఆంధ్ర యూనివర్శిటీలోని సీమెన్స్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ బోర్డు తీసేసి ప్రధానమంత్రి కౌశల్ వికాస యోజన (పిఎంకేవీవై) అనే బోర్డు తగిలించారన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటే తప్పని చెప్పిన వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు పిఎంకెవీవై పేరు ఎలా పెట్టారో చెప్పాలన్నారు. ప్రధానమంత్రి పేరు పెట్టడానికి తాము వ్యతిరేకం కాదని, కానీ నిన్నటి వరకు రాష్ట్రంలో ఎక్కడా స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ లేదని చెప్పిన జగన్ ప్రభుత్వం నేడు అదే సెంటర్‌కు ప్రధాని పేరు ఎలా పెట్టారు? అని ప్రశ్నించారు.

స్కిల్‌ని స్కామ్ అని, రాష్ట్రం మొత్తం మీద ఒక్క స్కిల్ సెంటర్ కూడా ఏర్పాటు చేయలేదని చెప్పి, ఇప్పుడు అదే సెంటర్లకు ప్రధాని పేరు, ఫోటో పెట్టడం విడ్డూరం కాదా? అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్కిల్ సెంటర్లలో ఒక్క పరికరం పెట్టలేదని చెప్పారని, కేబినెట్ ఆమోదం లేదని చెప్పారని, మనీ లాండరింగ్ జరిగిందన్నారని, ఒప్పందాలకు... జీవోలకు పొంతన లేదన్నారని, బోగస్ ఇన్వాయిస్‌లు పెట్టి కోట్లాది రూపాయల నిధులు దోచారని ఆరోపించారని, కానీ ఇప్పుడు ప్రధాని పేరు, ఫోటో పెట్టారన్నారు. జగన్ రెడ్డి! నీ మతలబు ప్రజలకు తెలిసిపోయింది, అవినీతి కేసుల్లో కూరుకుపోయిన నీకు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే దమ్ము లేదని ఎద్దేవా చేశారు.

చంద్రబాబు మచ్చలేని చంద్రుడుగా, కడిగిన ముత్యంలా తిరిగి వస్తున్నారని జగన్ వణికిపోతున్నారన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులో ఎలాంటి అవినీతి జరగలేదని కోర్టులు తేల్చబోతున్నాయని గుర్తించిన జగన్ ప్రధానమంత్రి ఫోటో పెట్టుకుని తనను తాను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని, అందులో భాగంగానే విశాఖలో సీమెన్స్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌కు పిఎంకేవీవై బోర్డు తగిలించారన్నారు. 31 కేసుల్లో జగన్ ఇరుక్కుని, ఆ కేసుల్లో పదేళ్లుగా బెయిలుపై తిరుగుతూ కేంద్రం ప్రభుత్వ ఆశీస్సులు లేకపోతే నిలువనీడలేని జగన్ కేంద్రాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాడని విమర్శించారు.

స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుపై కనీసం అవగాహన లేని వైసీపీ మంత్రులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. పోలవరానికి ఎన్ని గేట్లు ఉన్నాయో తెలియని మంత్రి, కాపులను ఇష్టమొచ్చినట్టు దుర్భాషలాడిన మంత్రి, పూజారులను కొడితే తప్పేంటన్న మంత్రి, తెలుగు గానీ... ఇంగ్లీషు గానీ రాని మంత్రి, సన్న బియ్యం ఇవ్వలేని మంత్రులు నిస్సిగ్గుగా స్కిల్ డెవలప్‌మెంట్‌పై మాట్లాడుతున్నారన్నారు. స్కిల్ కేసుపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన ఈ మంత్రులు ఆంధ్రా యూనివర్శిటీలోని సీమెన్స్ స్కిల్  డెవలప్‌మెంట్‌ సెంటర్‌కు బోర్డు ఎందుకు మార్చారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. నోరుంది కదా అని మాట్లాడితే ప్రజలు చూస్తూ ఊరుకోరన్నారు. యువత భవిష్యత్తు కోసం ఉన్నత లక్ష్యాలతో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుపై అవినీతి ముద్ర వేసి కోర్టులకు తప్పుడు సమాచారం ఇస్తూ తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు.

సీమెన్స్‌తో ఒప్పందం చేసుకుని స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులను ప్రారంభించిన 14 రాష్ట్రాలలో అక్కడ ఏ ముఖ్యమంత్రికి కనిపించని అవినీతి జగన్ ఒక్కడికే కనిపిస్తోందన్నారు. సాక్షాత్తు నేటి ప్రధాని, నాటి గుజరాత్ సీఎం నరేంద్ర మోదీకి కూడా ఎలాంటి అవినీతి కనిపించలేదన్నారు. కానీ సైకో ముఖ్యమంత్రి జగన్‌కు మాత్రం లేని, జరగని అవినీతి కనిపిస్తోందన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులో ఎలాంటి అవినీతి జరగలేదని తెలుసుకున్న జగన్ ఇప్పుడు ప్రధానమంత్రి బోర్డు, ఫోటో పెట్టి తప్పించుకోవాలని చూస్తున్నాడని ఆరోపించారు.

More Telugu News