vangalapudi anitha: ఆ రోజు రోజా ఆడదనే విషయం మరిచిపోయిందా? లేక ఈ రోజు గుర్తుకు వచ్చిందా?: వంగలపూడి అనిత

  • రోజాకు తన వరకు వచ్చేసరికి ఆడతనం గుర్తుకు వచ్చిందా? అని నిలదీత
  • రాష్ట్రంలో భారతి, రోజా తప్ప ఇంకెవరూ మహిళలు లేరా? అని ప్రశ్న
  • అసెంబ్లీలో నా గురించి, పీతల సుజాత గురించి అసభ్యంగా మాట్లాడారని ఆగ్రహం
  • రోజా ఇప్పుడు గ్లిజరిన్ ఏడుపులు ఏడ్చారా? మహానటి ఏడుపులా? అని ఎద్దేవా
  • రోజా చేష్టలు, మాటల కారణంగానే రోజాకు ఏ మహిళ నుంచి మద్దతు లేదని వ్యాఖ్య
Vangalapudi Anitha lashes out at roja

తమ పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కుటుంబాలపై అసభ్యంగా మాట్లాడిన రోజాకు తనవరకు వచ్చేసరికి ఆడతనం గుర్తుకు వచ్చిందా? అని టీడీపీ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత నిలదీశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతి, రోజా తప్ప ఇక మహిళలు ఎవరూ లేరా? అని ప్రశ్నించారు. ఆమె బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ... గత అసెంబ్లీలో తన గురించి, పీతల సుజాత గురించి మంత్రి రోజా అసభ్యంగా మాట్లాడారని గుర్తు చేశారు. ఆమె నోటికి వచ్చినట్లు మాట్లాడారని, అప్పుడు తాను, తన పిల్లలు టీవీ, పేపర్ చూసేందుకు కూడా భయపడ్డామన్నారు.

ఆ రోజు ఇదే రోజా తాను కూడా ఆడదానిని అనే విషయం మరిచిపోయిందా? లేక ఈ రోజే తాను ఆడదానిని అనే విషయం ఆమెకు గుర్తుకు వచ్చిందా? అని అడిగారు. పీతల సుజాత గురించి అసెంబ్లీ సాక్షిగా వికృత చేష్టలు చేసినప్పుడు ఈ ఆడతనం ఏమయిందో చెప్పాలన్నారు. ఇదే చంద్రబాబు గురించి అసెంబ్లీ సాక్షిగా ఏం మాట్లాడావ్? కామ సీఎం అన్నావని మండిపడ్డారు. గతంలో తాము ఏడిస్తే దొంగ ఏడుపులు అన్న రోజా ఇప్పుడు గ్లిజరిన్ ఏడుపులు ఏడ్చారా? లేక మహానటి ఏడుపులా? అని నిలదీశారు. ఈ రోజు నీవరకు వచ్చేసరికి తెలిసిందా? అన్నారు.

ఇవాళ రోజా నీతులు మాట్లాడుతుంటే ఏమనుకోవాలన్నారు. రోజా ప్రవర్తన కారణంగా ఆమె ఎంత ఏడ్చినా ప్రజలు సానుభూతి చూపడం లేదన్నారు. నువ్వు చేసిన చేష్టలు, నువ్వు మాట్లాడిన మాటలు, నీ బాడీ లాంగ్వేజ్ కారణంగా ఈ రోజు ఏ మహిళ స్పందించడం లేదన్నారు. ఒకసారి రోజా తన పాత వీడియోలు తెప్పించుకొని చూసి, తన ప్రవర్తనను పునఃసమీక్షించుకోవాలన్నారు. బండారు సత్యనారాయణమూర్తి ఇప్పుడు నీపై చేసిన వ్యాఖ్యల కంటే గతంలో నీవు చేసిన వ్యాఖ్యలు చాలా దరిద్రంగా ఉన్నాయన్నారు.

గన్ కంటే ముందు జగన్ వస్తాడని అసెంబ్లీలో సినిమా డైలాగ్‌లు చెప్పావని, కానీ లక్షా ఇరవై రెండువేల మంది ఆడబిడ్డల మానప్రాణాలు పోతుంటే రోజా ఎందుకు కనీసం కన్నీరు కార్చలేదు? అని నిలదీశారు. అమరావతి రైతుల గురించి, వారు కట్టుకున్న చీరల గురించి ఈ వెధవలు మాట్లాడారని నిప్పులు చెరిగారు. ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? ఆ రోజు మహిళ, ఆడతనం రోజాకు గుర్తుకు రాలేదా? అని నిలదీశారు. అలాంటప్పుడు ఆమెకు ఎవరు మద్దతిస్తారన్నారు.

భారతి గురించి మాట్లాడినా, రోజు గురించి మాట్లాడినా పోలీసులు వచ్చి కేసు పెడతారని, మరి మా గురించి మాట్లాడినప్పుడు పోలీసులు వచ్చి ఎందుకు కేసులు పెట్టడం లేదో చెప్పాలన్నారు. చంద్రబాబు, పవన్ కుటుంబ సభ్యులను వైసీపీ నేతలు దూషించినప్పుడు రోజా ఎక్కడ ఉన్నారని నిలదీశారు. టీడీపీ మహిళా నేతలపై అసభ్యంగా మాట్లాడుతుంటే కేసులు ఉండవా? అన్నారు.

More Telugu News