Guntur Kaaram: 'గుంటూరు కారం' సినిమాలో పూజాహెగ్డే స్థానాన్ని అందుకే రీప్లేస్ చేశాం.. నాగవంశీ క్లారిటీ

  • గుంటూరు కారం సినిమాపై బోల్డన్ని రూమర్లు
  • అన్నింటిపైనా మరోమారు క్లారిటీ ఇచ్చిన నిర్మాత నాగవంశీ
  • పూజాహెగ్డే ప్లేస్‌లో మీనాక్షి చౌదరి ఎందుకు వచ్చిందో వివరణ
  • వచ్చే ఏడాది జనవరి 12న సినిమాను విడుదల చేస్తామన్న నిర్మాత
  • రాబోయే చిత్రాల గురించి వెల్లడి
Gunturu Kaaram Producer Naga Vamsi Clarifies About Replace Of Pooja Hegde

మహేశ్‌బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘గుంటూరు కారం’ సినిమా విషయంలో వస్తున్న పలు రూమర్లపై నిర్మాత నాగవంశీ మరోమారు స్పందించారు. ముందుగా అనుకున్న కథతో సినిమాను రూపొందడం లేదని, దర్శకుడిని మార్చేశారని, సంగీత దర్శకుడిని మార్చేశారని, ముందుగా పూజాహెగ్డేను తీసుకుని ఆ తర్వాత మరో హీరోయిన్‌ను తీసుకున్నారని, సినిమాను రీషూట్ కూడా చేశారని, సినిమా వాయిదా పడుతుందని.. ఇలా పలు రూమర్లు చక్కర్లు కొట్టాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడిన నిర్మాత నాగవంశీ ఈ రూమర్లపై స్పందించారు. 

నిజానికి గుంటూరు కారం సినిమాను ఆగస్టులోనే విడుదల చేయాలనుకున్నామని, అయితే ఆ తర్వాత వచ్చే ఏడాది జనవరి 12కు మార్చామని తెలిపారు. అందుకనే నెమ్మదిగా చిత్రీకరిస్తున్నట్టు తెలిపారు. పూజాహెగ్డే రీప్లేస్ వార్తలపై మాట్లాడుతూ.. ఆమె మరో హిందీ చిత్రంలో నటించాల్సి వచ్చిందని, డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఆమె స్థానాన్ని మీనాక్షి చౌదరితో భర్తీ చేశాం తప్పితే మరో కారణం లేదని వివరించారు. మహేశ్‌బాబు ఈ సినిమాలో భిన్నంగా కనిపిస్తారని, పండుగకు వచ్చే సినిమాలో ఉండాల్సిన అన్ని అంశాలు ఇందులో ఉంటాయని పేర్కొన్నారు. సంక్రాంతికి పక్కాగా ఈ సినిమాను విడుదల చేస్తామని, త్వరలోనే ఫస్ట్ సింగిల్ వస్తుందని చెప్పారు. 

విజయ్ దేవరకొండ-గౌతమి తిన్ననూరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమాలో శ్రీలీల హీరోయిన్ అని, రష్మికను తీసుకున్నామన్న వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పారు. బాలకృష్ణ-బాబీ కాంబినేషన్‌లో ఓ సినిమాను నిర్మిస్తున్నట్టు చెప్పిన నాగవంశీ.. ఇది ఎవరూ ఊహించని విధంగా ఉంటుందని తెలిపారు. వైష్ణవ్‌తేజ్‌తో ‘ఆదికేశవ’, విష్వక్సేన్‌తో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’, సిద్ధు జొన్నలగడ్డతో ‘టిల్లు స్క్వేర్’ సినిమాలు నిర్మిస్తున్నామని, ఇవి చిత్రీకరణ జరుపుకుంటున్నాయని వివరించారు. అల్లు అర్జున్-త్రివక్రమ్, ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో మరో సినిమా నిర్మించనున్నట్టు నాగవంశీ వివరించారు.

More Telugu News