Vijayasai Reddy: సంతకాలుపెట్టి కూడా సంబంధం లేదంటే ఎలా అచ్చెన్నా?.. విజయసాయిరెడ్డి ఎద్దేవా

  • కొల్లగొట్టిన సొమ్ములో తక్కువ వాటా ముట్టిందనా? అని అచ్చెన్నాయుడికి ప్రశ్న
  • ఫైబర్‌గ్రిడ్ ప్రాజెక్టు తన పరిధిలోనిది కాదని లోకేశ్ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారన్న విజయసాయి
  • సీఐడీ దగ్గర మొత్తం చిట్టా ఉందన్న వైసీపీ నేత
YCP MP Vijayasai Reddy questions AP TDP Chief Atchannaidu on skill development case

స్కిల్ డెవలప్‌మెంట్, ఫైబర్ గ్రిడ్ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ప్రస్తుతం రాజమహేంద్రవరం జైలులో రిమాండ్‌లో ఉన్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో సీఐడీ తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్, రిమాండ్ రిపోర్టును కొట్టివేయాలంటూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించడంతో ఆయన సుప్రీంను ఆశ్రయించారు. అయితే, కోర్టుకు వరుస సెలవుల కారణంగా విచారణ వాయిదా పడుతూ వస్తోంది. అక్టోబరు 3న పిటిషన్‌ను విచారిస్తామని తాజాగా కోర్టు తెలిపింది.

మరోవైపు, స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబుపై తొలి నుంచీ ఆరోపణలు చేస్తున్న వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోమారు ఎక్స్ వేదికగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సంతకాలు పెట్టి కూడా ఆ స్కాంతో తనకు సంబంధం లేదంటే ఎలా అని ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నను ప్రశ్నించారు. కొల్లగొట్టిన సొమ్ములో తక్కువ వాటా ముట్టిందనా? అని నిలదీశారు. ఇక లోకేశ్ అయితే ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు తన శాఖ పరిధిలోనిదే కాదని తప్పించుకోవాలని చూస్తున్నాడని అన్నారు. సీఐడీ దగ్గర చిట్టా అంతా ఉందని, ఎవరి ప్రమేయం ఎంతో పక్కా ఆధారాలతో తేలుస్తారని విజయసాయి ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.

More Telugu News