Betting: విశాఖలో ఇంటర్నేషనల్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు

  • ముఠాకు చెందిన 11 మంది అరెస్ట్.. మరికొందరి కోసం గాలింపు
  • 63 బ్యాంక్ అకౌంట్ల ద్వారా రూ. 367 కోట్ల లావాదేవీలు
  • అకౌంట్లను సీజ్ చేసిన పోలీసులు
Betting gang arrested in Vizag

విశాఖలో అంతర్జాతీయ బెట్టింగ్ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. వలపన్ని ముఠాను పట్టుకున్నారు. ముఠాకు చెందిన 11 మందిని అరెస్ట్ చేశామని, మరికొందరి కోసం గాలిస్తున్నామని డీసీపీ కంచి శ్రీనివాసరావు తెలిపారు. ఈ ముఠాలో వాసుదేవరావు, దినేశ్ అలియాస్ మోను ప్రధాన నిందితులని వెల్లడించారు. విశాఖ పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యనార్ ఆదేశాల మేరకు బెట్టింగ్ వ్యవహారంపై లోతుగా చర్చిస్తున్నామని చెప్పారు.  


ఈ బెట్టింగ్ ముఠా 63 బ్యాంక్ అకౌంట్స్ ఉపయోగించిందని... వీటి ద్వారా రూ. 367 కోట్ల లావాదేవీలు జరిగినట్టు గుర్తించామని డీసీపీ తెలిపారు. 32 అకౌంట్లలో ఇంకా రూ. 75 లక్షలు ఉన్నాయని... దీంతో ఆయా బ్యాంకులను సంప్రదించి ఆ అకౌంట్లను సీజ్ చేయించామని చెప్పారు. 11 మంది అకౌంట్ల నుంచి ఎవరెవరి ఖాతాల్లోకి డబ్బులు వెళ్లాయో తెలుసుకుంటున్నామని వెల్లడించారు. 

అనకాపల్లికి చెందిన సూరిబాబు ఈ ముఠాలో కీలకంగా వ్యవహరించినట్టు పోలీసులు గుర్తించారు. తొలుత వివిధ ఆన్ లైన్ యాప్స్ లో బెట్టింగ్ ప్రారంభించిన సూరిబాబు కొన్ని రోజులకే బుకీగా మారాడు. అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లు, ఐపీఎల్ మ్యాచ్ ల సమయాలలో బెట్టింగ్ నిర్వహించేవాడు. ఒక్కో మ్యాచ్ కు 20 నుంచి 30 మందితో బెట్టింగ్ ఆడిస్తూ నాలుగైదు లక్షలు జమ చేసేవాడు. ఏడాదికి రూ. 5 నుంచి 6 కోట్ల లావాదేవీలు జరిపేవాడు. ఈ బెట్టింగ్ డబ్బులను ఎవరికీ అనుమానం రాకుండా టూర్స్ అండ్ ట్రావెల్స్ యజమాని అయిన దినేశ్ కు పంపించేవాడు. కొన్నేళ్లుగా జరుగుతున్న ఈ బెట్టింగ్ వ్యవహారం ఇప్పుడు వెలుగు చూసింది.

More Telugu News