2k note: రూ.2 వేల నోటు మాకొద్దంటున్న వ్యాపారులు

  • నోటు మార్పిడికి ఎల్లుండితో ముగియనున్న గడువు
  • తమిళనాడు బస్సుల్లో పెద్ద నోటు వద్దంటున్న కండక్టర్లు
  • మార్కెట్లో కూడా తీసుకోవడంలేదంటున్న జనం
2k Note not accepting in buses and in market

రూ.2 వేల నోటు చలామణిని నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ).. నోట్లను మార్చుకునేందుకు సెప్టెంబర్ 30 వరకు గడువు ఇచ్చింది. మరో రెండు రోజుల్లో గడువు ముగియనుండడంతో మార్కెట్లో రూ.2 వేల నోటును వ్యాపారులు తీసుకోవడంలేదు. పెద్ద నోటు ఇస్తే చిల్లర లేదంటూ వద్దంటున్నారని పలువురు చెబుతున్నారు. మార్కెట్లో మాత్రమే కాదు ప్రభుత్వ సంస్థలలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. తమిళనాడు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కూడా పెద్ద నోట్లు తీసుకోవద్దంటూ కండక్టర్లు, డ్రైవర్లకు ఆదేశాలు జారీ చేసింది. గురువారం నుంచి రూ.2 వేల నోటును అంగీకరించ వద్దని చెప్పింది. నోట్ల మార్పిడికి గడువు దగ్గర పడడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

2016 నవంబర్ 8న రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ప్రత్యామ్నాయంగా రూ.500 కొత్త నోట్లను, రూ.2 వేల నోటును తీసుకురానున్నట్లు చెప్పారు. పాత నోట్ల రద్దు తర్వాత ఆర్బీఐ మార్కెట్లోకి విడుదల చేసిన రూ. 2 వేల నోటు తాత్కాలిక సౌలభ్యం కోసమేననే అభిప్రాయాలు అప్పట్లోనే వ్యక్తమయ్యాయి. దీనికి బలం చేకూర్చేలా 2019లో రూ.2 వేల నోట్ల ముద్రణను ఆర్బీఐ నిలిపి వేసింది. ఇటీవల ఈ నోటును చలామణిలో నుంచి తప్పిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది.

More Telugu News