Chinese scientist: భారత్ చంద్రయాన్ ప్రయోగంపై చైనా సైంటిస్ట్ సందేహాలు!

  • చంద్రయాన్-3 చంద్రుడి దక్షిణ ధ్రువానికి చేరుకోలేదని ప్రకటన
  • దక్షిణ ధ్రువానికి 619 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టు వ్యాఖ్య
  • దక్షిణ అక్షాంశంలో 69 డిగ్రీల వద్ద ఉందన్న ఒయాంజ్ జియూన్
Top Chinese scientist now claims India moon landing nowhere near south pole

భారత్-చైనా మధ్య ఒకవైపు సరిహద్దు వివాదాలు నెలకొనగా. మరోవైపు చైనా శాస్త్రవేత్త ఒకరు అంతరిక్ష విజయాల్లో భారత్ పాత్రను తక్కువ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రముఖ చైనా శాస్త్రవేత్త భారత్ చంద్రయాన్ ప్రయోగం ఫలితాలపై సందేహాలు వ్యక్తం చేశారు. చంద్రయాన్ -3 రోవర్ గత నెలలో చంద్రుడిపై అడుగు పెట్టి, ఎన్నో రకాల కీలక సమాచారాన్ని పంపిస్తుండడం తెలిసిందే. పైగా చంద్రుడి దక్షిణ ధ్రువంపై ఇది అడుగు పెట్టింది. చంద్రుడి దక్షిణ ధ్రువాన్ని చేరుకున్న తొలి దేశంగా భారత్ ఘనత సంపాదించుకుంది. చైనాకు కూడా ఇది సాధ్యం కాలేదు. దక్షిణ కొన వరకే అది చేరుకుంది. 

చంద్రుడిపై పరిశోధనలకు సంబంధించి చైనాలో పితామహుడిగా పేరొందిన శాస్త్రవేత్త ఒయాంజ్ జియూన్ భారత్ చంద్రయాన్-3పై స్పందించారు. చంద్రయాన్-3 ల్యాండింగ్ ప్రదేశం దక్షిణ అక్షాంశంలో 69 డిగ్రీల వద్ద ఉందన్నారు. ఇది దక్షిణ ధ్రువానికి (88.5 డిగ్రీల నుంచి 90 డిగ్రీల మధ్య) సమీపంలోనే లేదన్నారు. అసలు భారత చంద్రయాన్ దక్షిణ ధ్రువ ప్రాంతంలో, దక్షిణ ధ్రువానికి సమీపంలోనే లేదని చైనీ పత్రిక సైన్స్ టైమ్స్ కు చెప్పారు. చంద్రయాన్ -3 అనేది దక్షిణ ధ్రువానికి 619 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టు జియూన్ చెప్పారు. దీనిపై ఇస్రో ఇంకా స్పందించలేదు. చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం అయినప్పుడు.. చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ కూడా ఇదే మాదిరి కథనాలను ప్రచురించింది. భారత్ కంటే చైనా వద్ద మెరుగైన టెక్నాలజీ ఉన్నట్టు బీజింగ్ కు చెందిన సీనియర్ నిపుణుడు పాంగ్ జిహావో వ్యాఖ్యలను ప్రస్తావించింది.

More Telugu News