Narendra Modi: నా యూట్యూబ్ చానల్‌ను సబ్‌స్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌పై క్లిక్ చేయండి.. ప్రధాని మోదీ

  • 5 వేల మంది సమాచార సృష్టికర్తలను ఉద్దేశించి మాట్లాడిన మోదీ
  • 15 ఏళ్ల నుంచి యూట్యూబ్ ద్వారా దేశానికి, ప్రపంచానికి అనుసంధానమయ్యానన్న ప్రధాని
  • స్వచ్ఛ భారత్, లోకల్ ఫర్ ఓకల్ వంటి విషయాలపైనా మాట్లాడిన మోదీ
  • సమాచార సృష్టికర్తలలో తానూ ఒకడినన్న భావన చాలా ఆనందంగా ఉందని స్పష్టీకరణ
Hit Bell Icon and Subscribe My Channel PM Modi  Asks Subscribers

సాధారణ యూట్యూబర్‌లా తన యూట్యూబ్ చానల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోవాలని, మరిన్ని అప్‌డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ను క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కోరడం కోట్లాదిమంది భారతీయులను ఆశ్చర్యపరిచింది. యూట్యూబ్ ఫ్యాన్ ఫెస్ట్ ఇండియా 2023 కార్యక్రమంలో భాగంగా మోదీ నిన్న 5 వేల మంది సమాచార సృష్టికర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ అభ్యర్థన చేశారు.

తానేమీ భిన్నం కాదన్న ఆయన సమాచార సృష్టికర్తలలో తాను కూడా ఒకడినన్న భావన చాలా ఆనందాన్ని ఇస్తోందన్నారు. గత 15 ఏళ్ల నుంచి యూట్యూబ్ ద్వారా దేశానికి, ప్రపంచానికి అనుసంధానమయ్యానని పేర్కొన్నారు. తనకు కూడా బాగానే సబ్‌స్క్రైబర్లు ఉన్నారని పేర్కొన్నారు.

తన చానల్‌లో వేలకొద్దీ వీడియోలు ఉన్నాయని అయితే, పరీక్షల సమయంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఒత్తిడి, ఉత్పాదకతపెంపు, మేనేజ్‌మెంట్ వంటి వాటి గురించి యూట్యూబ్ ద్వారా విద్యార్థులతో మాట్లాడడం తనకు చాలా సంతృప్తిని ఇస్తుందని వివరించారు.

ఐదు నిమిషాలపాటు మాట్లాడిన మోదీ.. ‘స్వచ్ఛ భారత్’, ‘లోకల్ ఫర్ ఓకల్’ వంటి వాటిపైనా మాట్లాడారు. దేశ శ్రామికులు, కళాకారుల చేతుల్లో తయారైన మన వస్తువుల్ని కొనేలా భావోద్వేగ పూరిత విజ్ఞప్తి చేయాలని యూట్యూబర్లను కోరారు. చివర్లో సాధారణ యూట్యూబర్‌లా తన చానల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోవాలని కోరారు. ఆయన చానల్‌కు ప్రస్తుతం 1.79 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.

More Telugu News