మైసూరు మ్యూజియం నుంచి ప్రభాస్ బాహుబలి విగ్రహం తొలగించనున్న అధికారులు!

Mysore museum officials reportedly set to remove Prabhas Bahubali statue
  • మైసూరు మ్యూజియంలో బాహుబలి విగ్రహం
  • ప్రభాస్ పోలికలే లేవంటూ అభిమానుల ఆగ్రహం
  • ఆ విగ్రహం తొలగించాలన్న బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ
  • ఎవరి మనోభావాలు దెబ్బతీయాలన్నది తమ అభిమతం కాదన్న మ్యూజియం వర్గాలు
మైసూరు మ్యూజియంలో ప్రభాస్ బాహుబలి విగ్రహం అంటూ  ఇటీవల ఓ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఆ ఫొటోలో ఉన్న విగ్రహానికి ప్రభాస్ పోలికలు ఏమాత్రం లేకపోవడంతో అభిమానులు ట్రోలింగ్ కు తెరదీశారు. 

బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ కూడా మైసూరు మ్యూజియం తీరు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభాస్ విగ్రహాన్ని తయారుచేస్తున్నట్టు, దాన్ని మైసూరు మ్యూజియంలో ఆవిష్కరిస్తున్నట్టు తమకు ఎవరూ సమాచారం ఇవ్వలేదని తెలిపారు. అసలు, ఆ విగ్రహం నిపుణుడు తయారుచేసినట్టుగా లేదని వ్యాఖ్యానించారు. ఆ విగ్రహం తొలగింపునకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో స్పందించారు. 

ఈ నేపథ్యంలో, మైసూరు మ్యూజియం వర్గాలు వివరణ ఇచ్చాయి. ఎవరి మనోభావాలు దెబ్బతీయాలన్నది తమ అభిమతం కాదని మ్యూజియం అధికారులు స్పష్టం చేశారు. అయితే, విగ్రహం పట్ల అభ్యంతరాలు వస్తున్నందున, మ్యూజియం నుంచి ఆ విగ్రహాన్ని తొలగిస్తామని వెల్లడించారు.
Advertisement
Prabhas
Bahubali Statue
Mysore Museum
Shobhu Yarlagadda
Tollywood

More Telugu News