Tenth student: చదువుల ఒత్తిడి.. ఆన్ లైన్ గేమ్స్ కు బానిసై.. హైదరాబాద్ లో పదో క్లాసు బాలుడి ఆత్మహత్య

  • తల్లికి మెసేజ్ పెట్టి అపార్ట్ మెంట్ టెర్రస్ పైకి..
  • అర్ధరాత్రి 35వ అంతస్తు పైనుంచి దూకిన బాలుడు
  • తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి
Tenth student commits suicide In Hyderabad

ఓవైపు చదువుల ఒత్తిడి.. మరోవైపు ఆన్ లైన్ గేమ్స్ కు అలవాటుపడిన పదో తరగతి బాలుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. అపార్ట్ మెంట్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్ లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం..

రాయదుర్గం నాలెడ్జ్ సిటీలోని మై హోం అపార్ట్మెంట్ లో ఎం.సురేశ్ కుమార్ రెడ్డి భార్యా పిల్లలతో ఉంటున్నారు. ముంబైలోని ఓ కంపెనీలో పనిచేస్తున్న సురేశ్ కుమార్.. వారాంతాల్లో హైదరాబాద్ కు వచ్చి వెళుతుంటారు. సురేశ్ భార్య స్వరూప, ఇద్దరు కొడుకులతో కలిసి ఫ్లాట్ నెం 604 లో ఉంటున్నారు. ఇద్దరు కుమారుల్లో ఒకడైన రేయాన్ష్ రెడ్డి ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూలులో పదో తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో వ్యక్తిగత కారణాలతో చనిపోతున్నానంటూ సోమవారం సాయంత్రం రేయాన్ష్ తన తల్లికి మెసేజ్ పెట్టాడు. ఆపై ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు.

మెసేజ్ చూసుకున్న స్వరూప.. కొడుకు కోసం అపార్ట్మెంట్ తో పాటు స్నేహితుల ఇళ్లల్లో గాలించారు. అర్ధరాత్రి వరకూ వెతికినా రేయాన్ష్ ఆచూకీ దొరకకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు అపార్మెంట్ సీసీటీవీ కెమెరాలు పరిశీలించినా ఎలాంటి క్లూ దొరకలేదు. మంగళవారం ఉదయం అపార్మెంట్ పక్క బ్లాక్ లో నేలపై పడి ఉన్న రేయాన్ష్ మృతదేహాన్ని గుర్తించారు. అపార్మెంట్ పైనుంచి దూకడంతో తల ఛిద్రమైందని పోలీసులు వివరించారు. ప్రాథమిక విచారణలో చదువుల్లో ఒత్తిడి కారణంగానే రేయాన్ష్ ఆత్మహత్యకు పాల్పడినట్లు తేలిందని వివరించారు. సురేశ్ కుమార్ రెడ్డి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

More Telugu News