Waheeda Rehman: వహీదా రెహమాన్ కు ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు

  • 2023 సంవత్సరానికి ఎంపిక చేసిన కేంద్రం
  • ట్విట్టర్ లో ప్రకటించిన కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్
  • 1955 లో రోజులు మారాయి చిత్రంతో సినిమాల్లోకి వహీదా ఎంట్రీ
Waheeda Rehman to be conferred with Dadasaheb Phalke award

బాలీవుడ్ ప్రముఖ సీనియర్ నటి వహీదా రెహమాన్ ను ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు వరించింది. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార శాఖ ప్రకటన విడుదల చేసింది. గతేడాది ఈ అవార్డు ఆషా పరేఖ్ కు లభించింది.

‘‘భారతీయ సినిమాకు అద్భుతమైన సేవలు అందించిన వహీదా రెహమాన్ జీకి, ఈ ఏడాదికి గాను ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డును ప్రదానం చేస్తున్నట్టు ప్రకటించడానికి ఎంతో సంతోషిస్తున్నాను. మహీదాజీ హిందీ సినిమాల్లో తన పాత్రలతో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నారు. వాటిల్లో ప్యాసా, కాగజ్ కే ఫూల్, చౌదావీ కా చాంద్, సాహెబ్ బీవీ ఔర్ గులామ్, గైడ్, ఖామోషి తదితర చిత్రాలు ఉన్నాయి. ఐదు దశాబ్దాలకు పైగా ఆమె కెరీర్ కొనసాగింది’’ అంటూ కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ట్వీట్ చేశారు.

వహీదా రెహమాన్ 1955లో వచ్చిన రోజులు మారాయి అనే తెలుగు సినిమాతో తన నటన కెరీర్ ఆరంభించారు. ఆ తర్వాత బాలీవుడ్ కు మారి నటిగా రాణించి అక్కడే స్థిరపడ్డారు. రేష్మ ఔర్ షేరా సినిమాలో పాత్రకు గాను నేషనల్ ఫిల్మ్ అవార్డ్, పద్మశ్రీ, పద్మ భూషణ్ సైతం ఆమెను వరించాయి. కృషితో తన కెరీర్లో అత్యున్నత శిఖరాలకు చేరుకున్న భారతీయ వనితకు వహీదా నిదర్శనమని కేంద్ర మంత్రి ఠాకూర్ పేర్కొన్నారు.

More Telugu News