Netherlands: నెదర్లాండ్స్ ప్రపంచ కప్​ జట్టును చిత్తు చేసిన కర్ణాటక

  • ప్రపంచ కప్‌నకు అర్హత సాధించిన డచ్‌ జట్టు
  • మెగా టోర్నీకి సన్నాహాల కోసం ముందుగానే భారత్ వచ్చిన జట్టు
  • 50 ఓవర్ల మ్యాచ్‌లో 142 పరుగుల తేడాతో ఓడించిన కర్ణాటక
Karnataka crush Netherlands by 142 runs

క్వాలిఫయింగ్‌ టోర్నీలో రెండుసార్లు విశ్వ విజేత వెస్టిండీస్‌ను ఓడించి భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న వన్డే ప్రపంచ కప్‌నకు అర్హత సాధించిన నెదర్లాండ్స్ జట్టుకు షాక్ తగిలింది. ప్రపంచ కప్ సన్నాహకాల్లో భాగంగా ముందుగానే భారత్‌కు వచ్చిన ఆ జట్టు కర్ణాటక స్టేట్ టీమ్‌తో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది. ఈ పోరులో డచ్‌ జట్టు ఘోర ఓటమి చవి చూసింది. ఆలూర్‌‌లో నిన్న జరిగిన 50 ఓవర్ల ప్రాక్టీస్ మ్యాచ్‌లో కర్ణాటక జట్టు ఏకంగా 142 పరుగుల తేడాతో నెదర్లాండ్స్‌ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కర్ణాటక 46 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌటైంది. ఆర్. సమర్థ్ 81, దేవదత్ పడిక్కల్ 56, మయాంక్ అగర్వాల్ 27 పరుగులు చేశారు. 

ప్రత్యర్థి బౌలర్లలో విక్రమ్‌జీత్ సింగ్ నాలుగు, ర్యాన్ క్లెయిన్‌ మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనకు వచ్చిన డచ్‌ జట్టు 25 ఓవర్లలోనే 123 పరుగులకే కుప్పకూలింది. ర్యాన్ క్లెయిన్‌ 49, పాల్ వాన్ 45 పరుగులతో టాప్‌ స్కోరర్లుగా నిలిచారు. మిగతా బ్యాటర్లంతా పెవిలియన్‌కు క్యూ కట్టారు. కర్ణాటక బౌలర్లలో విశ్వథ్ కావేరప్ప, కౌశిక్ చెరో నాలుగు వికెట్లతో నెదర్లాండ్స్ జట్టు నడ్డి విరిచారు. ఒక స్టేట్‌ టీమ్‌తో ప్రాక్టీస్‌ మ్యాచ్‌లోనే ఇంత ఘోరంగా ఓడి నెదర్లాండ్స్‌ జాతీయ జట్టు ఇక ప్రపంచ కప్‌లో టీమిండియా, ఇతర మేటి జట్లకు ఏ మేరకు పోటీ ఇస్తుందన్న ప్రశ్నలు వస్తున్నాయి.

More Telugu News