తెలంగాణ ఎన్నికల్లోనూ ‘ఓట్ ఫ్రం హోం’.. అవకాశం ఎవరికంటే..!
- రాష్ట్రంలో ఇప్పటికే మొదలైన ఎన్నికల హడావుడి
- వచ్చే నెల 3న రాష్ట్రంలో ఈసీ అధికారుల పర్యటన
- 80 ఏళ్లు పైబడిన వారు ఇంటి నుంచే ఓటు వేసే సౌకర్యం
అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగా ఓట్ ఫ్రం హోం విధానాన్ని అమలు చేయనున్నట్లు ఈసీ అధికారులు చెబుతున్నారు. ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఈ విధానాన్ని విజయవంతంగా అమలు చేసినట్లు తెలిపారు. ఈ విధానంలో భాగంగా.. 80 ఏళ్లు పైబడిన వృద్ధులకు తమ ఇంటి నుంచే ఓటు వేసే సదుపాయం కల్పించనున్నారు. వయసు పైబడడంతో వారు పోలింగ్ కేంద్రానికి రావడానికి వారి ఆరోగ్యం సహకరించకపోవచ్చని, వారి ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ విధానాన్ని తీసుకొచ్చామని వివరించారు.
ఓటింగ్ పర్సెంటేజ్ పెంచడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని ఓటర్లలో 80 ఏళ్లు పైబడిన ప్రతీ ఒక్కరికి ఈ అవకాశం కల్పించనున్నట్లు సమాచారం. అయితే, ముందస్తుగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈసీ లెక్కల ప్రకారం ప్రస్తుతం తెలంగాణలో 80 ఏళ్లు దాటిన ఓటర్లు 4.87 లక్షల మంది ఉన్నారు. ఇందులో ముందుగా దరఖాస్తు చేసుకున్న వారి కోసం పోస్టల్ బ్యాలెట్ ను సిద్ధం చేయనున్నట్లు అధికారులు తెలిపారు.