Singareni Collieries Company: సింగరేణి కార్మికుల పంట పడింది.. ఒక్కొక్కరి ఖాతాలో రూ. 3.7 లక్షల జమ

  • 11వ వేజ్‌బోర్డు బకాయిలు విడుదల చేసిన యాజమాన్యం
  • 39 వేల మంది కార్మికుల ఖాతాల్లోకి రూ. 1450 కోట్లు
  • అత్యధికంగా రూ. 9.91 లక్షలు అందుకున్న ఓ కార్మికుడు
Singareni transfers 1450 crore wage board arrears to workers

సాధారణంగా ప్రతి దసరా పండగ సందర్భంగా సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం, సంస్థ యాజమాన్యం బోనస్ ప్రకటిస్తుంటాయి. ఈ ఏడాది మాత్రం సింగరేణి కార్మికులకు పండగ ముందే వచ్చేసింది. ఒక్కో కార్మికుడి ఖాతాలో కనీసం రూ. 3.7 లక్షలు జమ అయ్యాయి. ఇది దసరా బోనస్ కాదు. 11వ వేజ్‌బోర్డు బకాయిల చెల్లింపుల ద్వారా అందించిన మొత్తం కావడం గమనార్హం. 11వ వేజ్ బోర్డు బకాయిలు మొత్తం రూ.1450 కోట్లను యాజమాన్యం విడుదల చేసింది. ఆన్‌లైన్‌ ద్వారా 39 వేల మంది కార్మికుల ఖాతాల్లోకి బదిలీ చేసింది. సింగరేణి చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో ఒకే దఫా బకాయిలను చెల్లించడం ఇదే మొదటిసారి. 

వేతన బకాయిలు పొందిన వారిలో సింగరేణి టాపర్‌గా రామగుండం-1 ఏరియా హెడ్‌ ఓవర్‌మెన్‌ వేముల సుదర్శన్‌రెడ్డి రూ. 9.91 లక్షలతో అగ్రస్థానంలో నిలిచారు. రూ. 9.35 లక్షలతో రామగుండం-2 ఏరియాకు చెందిన ఈఐపీ ఆపరేటర్‌ మీర్జా ఉస్మాన్‌ బేగ్‌ రెండో స్థానంలో ఉన్నారని అధికారులు తెలిపారు. కాగా, సీఎం కేసీఆర్‌ గతంలో ప్రకటించిన రూ.700 కోట్ల లాభాల బోనస్‌ను దసరా కన్నా ముందే చెల్లించడానికి ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. దీపావళి బోనస్‌ పీఎల్‌ఆర్‌ను కూడా ముందే చెల్లించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు.

More Telugu News