ఏపీ అసెంబ్లీ రెండో రోజు సమావేశాలు.. ప్లకార్డులతో టీడీపీ ఆందోళన.. బుగ్గన ఆగ్రహం

  • చంద్రబాబు అరెస్ట్ పై వాయిదా తీర్మానం ఇచ్చిన టీడీపీ
  • స్పీకర్ పోడియంను చుట్టుముట్టిన టీడీపీ సభ్యులు
  • టీడీపీ సభ్యులు నోరు అదుపులో ఉంచుకోవాలన్న బుగ్గన
రెండో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. పాదయాత్రగా అసెంబ్లీకి చేరుకున్న టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసనలు వ్యక్తం చేస్తూ, ప్లకార్డులు పట్టుకుని శాసనసభ, శాసనమండలిలోకి వెళ్లారు. ఈరోజు కూడా టీడీపీ చంద్రబాబు అరెస్ట్ పై వాయిదా తీర్మానాన్ని ఇచ్చింది. వాయిదా తీర్మానంపై చర్చ జరగాల్సిందేనని టీడీపీ సభ్యులు ఆందోళన ప్రారంభించారు. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలుపుతున్నారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారంటూ నినాదాలు చేస్తున్నారు.

మరోవైపు, స్కిల్ డెవలప్ మెంట్ అంశంపై అసెంబ్లీలో ఈరోజు చర్చ జరిగే అవకాశం ఉంది. ఇంకోవైపు చంద్రబాబు అరెస్ట్ పై చర్చకు తాము సిద్ధమని వైసీపీ సభ్యులు అంటున్నారు. సభలో మంత్రి బుగ్గన మాట్లాడుతూ... టీడీపీ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే బాగుండదని మండిపడ్డారు. నోరు అదుపులో ఉంచుకోవాలని హెచ్చరించారు. టీడీపీ సభ్యుల తీరు ఏమాత్రం బాగోలేదని, సభలోకి వచ్చిన వెంటనే గోల చేస్తున్నారని మండిపడ్డారు. వయసుకు తగ్గట్టుగా టీడీపీ సభ్యులు వ్యవహరించడం లేదని అన్నారు.

AP Assembly Session
Telugudesam
YSRCP
Buggana Rajendranath

More Telugu News