Vande Bharat Express: ‘వందేభారత్‌’లో 25 మార్పులు.. ప్రయాణం ఇకపై మరింత సౌకర్యవంతం

ఇకపై వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారనుంది. తెలుగు రాష్ట్రాల నుంచి మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న వందేభారత్‌ రైళ్లల్లో ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణం కోసం మొత్తం 25 మార్పులు చేసినట్టు రైల్వే శాఖ పేర్కొంది. సీట్లలో మరింత వెనక్కు వాలి నిద్రపోయేందుకు వీలుగా పుష్‌బ్యాక్, సీట్ల మెత్తదనాన్ని పెంచారు. మొబైల్ చార్జింగ్ పాయింట్, ఫుట్‌రెస్ట్‌లోనూ మార్పులు చేశారు. మరుగుదొడ్లలో వెలుతురును, వాష్‌బేసిన్ల లోతును కూడా పెంచారు. ఏసీ మరింత సమర్థవంతంగా పనిచేసేలా మార్పులు చేశారు. ఎనిమిది గంటల పాటు కూర్చుని ప్రయాణం చేయాల్సి రావడంతో ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతున్నారన్న తలంపుతో రైల్వే ఈ చర్యలు తీసుకుంది. 

మరోవైపు, గురువారం కాచిగూడ-యశ్వంత్‌పూర్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ట్రయల్ రన్ నిర్వహించారు. ఉదయం కాచిగూడ నుంచి బెంగళూరుకు వెళ్లిన రైలు రాత్రి తిరిగొచ్చింది. ఇక విజయవాడ నుంచి చెన్నై వెళ్లే రైళ్లన్నీ గూడూరు నుంచి నేరుగా వెళుతుంటే విజయవాడ-చెన్నై వందేభారత్ మాత్రం గూడురు నుంచి శ్రీకాళహస్తి, రేణిగుంట, అరక్కోణం, తిరువళ్లూరు మీదుగా చెన్నైకి వెళుతుందని దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ తెలిపారు.
Vande Bharat Express
Indian Railways

More Telugu News