India: భారత్-కెనడా మధ్య ఉద్రిక్తత.. ఖలిస్థాన్ గ్రూపులతో పాక్ గూఢచారుల రహస్య సమావేశం

  • ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్‌సింగ్ నిజ్జర్ హత్య వెనక భారత్ హస్తముందని కెనడా ఆరోపణ
  • ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం
  • ఐదు రోజుల క్రితం వాంకోవర్‌లో ఐఎస్ఐ ఏజెంట్లు-ఖలిస్థానీ పెద్దల రహస్య సమావేశం
  • భారత వ్యతిరేక ప్రచారాన్ని వీలైనంత ముమ్మరం చేయాలని నిర్ణయం
Amid India and Canada row Pak spy agents secretly meet Khalistani groups in Canada

భారత్-కెనడా మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ ఏజెంట్లు కెనడాలోని ఖలిస్థాన్ ఉగ్రసంస్థ అధిపతులతో రహస్య సమావేశం నిర్వహించిన విషయం వెలుగులోకి వచ్చింది. వాంకోవర్‌లో ఐదు రోజుల క్రితం జరిగిన ఈ సమావేశంలో సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్‌జే) చీఫ్ గుర్‌పత్వంత్‌సింగ్ పన్నున్ సహా ఇతర పెద్దలు హాజరైనట్టు ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తెలిసింది. భారత వ్యతిరేక ప్రచారాన్ని వీలైనంత త్వరగా వ్యాప్తి చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్టు సమాచారం.

‘ప్లాన్-కె’గా వ్యవహరిస్తున్న కుట్రలో భాగంగా కెనడాలో ఖలిస్థానీ కార్యకలాపాలకు పాక్ ఐఎస్ఐ కొన్ని నెలలుగా భారీగా నిధులు సమకూరుస్తోంది. భారత్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించడం, పోస్టర్లు, బ్యానర్లు ముద్రించడం వంటి వాటికి ఈ సొమ్మును ఖర్చు చేస్తున్నారు. భారత్-కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్న వేళ పాక్ గూఢచారులు-ఖలిస్థానీ ఉగ్రవాదుల మధ్య రహస్య సమావేశం జరిగిన విషయం వెలుగుచూడడం గమనార్హం.

ఈ ఏడాది జూన్‌లో బ్రిటిష్ కొలంబియాలోని సర్రేలో ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్‌సింగ్ నిజ్జర్ హత్యకు గురయ్యాడు. ఈ హత్య వెనక భారత ఏజెంట్లు ఉన్నారన్నది కెనడా ప్రధాన ఆరోపణ. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. కాగా, ప్రస్తుతం కెనాడాలో 20 మందికిపైగా ఖలిస్థానీ ఉగ్రవాదులు, ఏజెంట్లు తలదాచుకుంటున్నారు.

More Telugu News