Andhra Pradesh: కొలంబియా వర్సిటీలో ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ప్రసంగం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల పదిమంది విద్యార్థి బృందం అమెరికాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో మొదటి రోజు ఐక్యరాజ్య సమితి సస్టైనబుల్ డెవలప్ మెంట్ యాక్షన్ వీకెండ్ లో పాల్గొంది. రెండో రోజు కొలంబియా యూనివర్సిటీలో జరిగిన సెమినార్ కు హాజరైంది. న్యూయార్క్ లోని ఈ వర్సిటీలో సోమవారం ‘ఎడ్యుకేట్ ఏ చైల్డ్’ పేరుతో సెమినార్ జరిగింది. ఇందులో భాగంగా కెనడా, ఉగాండ, కెన్యా సహా పలు దేశాల విద్యార్థులతో జరిగిన చర్చల్లో ఏపీ విద్యార్థులు పాల్గొన్నారు. సెమినార్ లో ప్రసంగించారు.

ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ విద్యాసంస్థలు, విద్యా విధానాల గురించి ప్రపంచ ప్రసిద్ధి పొందిన వర్సిటీ వేదికగా వెల్లడించారు. ఇతర దేశాల విద్యార్థులతో జరిగిన గ్రూప్ డిస్కషన్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో విద్యారంగంలో ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులను వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యావకాశాలను పెంచడం, విద్యార్థులకు సమతుల ఆహారం అందించడం, ఇంటర్నెట్ సేవలు, విద్యార్థులకు ట్యాబ్లెట్స్ అందించడంతో పాటు పాఠ్యాంశాలను మెరుగ్గా అర్థం చేసుకోవడానికి పాఠ్యపుస్తకాలను రెండు భాషల్లో ముద్రించడం తదితర అంశాలను విద్యార్థులు ప్రస్తావించారు.
Andhra Pradesh
Govt students
USA Tour
columbia university
newyork

More Telugu News