Medak District: పోలీసు ఉద్యోగం వద్దంటూ అత్తింటివారి ఒత్తిడి.. పెళ్లైన 4 నెలలకే వివాహిత ఆత్మహత్య

  • మెదక్ జిల్లా నంగనూరు మండలం గట్లమాల్యాల గ్రామంలో శుక్రవారం ఘటన
  • ఎంబీఏ చదివిన మహిళకు నాలుగు నెలల క్రితం వివాహం
  • ఇటీవలే కానిస్టేబుల్ పరీక్షల్లో ఉత్తీర్ణురాలైన వైనం
  • పోలీసు ఉద్యోగం వద్దంటూ అత్తింటివారు సూటిపోటీ మాటలతో వేధింపులు
  • ఉరివేసుకుని మహిళ ఆత్మహత్య
Medak Woman commits suicide after in laws pressurizes her to not take up police job

పోలీసు కావాలనుకున్న ఓ మహిళ అనుకున్న లక్ష్యం సాధించింది. ఇటీవలే కానిస్టేబుల్ జాబ్‌కు ఎంపికైంది. కానీ పోలీసు ఉద్యోగం వద్దని అత్తింటివారు ఒత్తిడి చేయడంతో మహిళ కలచెదిరి ఆత్మహత్యకు పాల్పడింది. మెదక్ జిల్లాలో శుక్రవారం ఈ దారుణం వెలుగు చూసింది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కరీంనగర్ జిల్లా వీణవంక మండలం మల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన మార్త రాజయ్య కుమార్తె కల్యాణికి మెదక్ జిల్లా  నంగునూరు మండలం గట్లమాల్యాల గ్రామానికి చెందిన కారు హరీశ్‌తో నాలుగు నెలల క్రితం వివాహం జరిగింది. కల్యాణి ఎంబీఏ చదివింది. ఆమెకు పోలీసు ఉద్యోగం చేయాలని ఎప్పటి నుంచో కోరిక. ఇటీవల పోలీసు పరీక్షలు రాసిన కల్యాణి కానిస్టేబుల్ ఉద్యోగానికి అర్హత సాధించింది. 

అయితే, పోలీస్ ఉద్యోగం వద్దంటూ భర్త హరీశ్, అత్త రమణ, మరిది శ్రీహరి సూటిపోటి మాటలతో ఆమెను మానసికంగా వేధించారు. వారి తీరు తట్టుకోలేకపోయిన కల్యాణి శుక్రవారం రాత్రి ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అత్తింటి వారి వేధింపులే తన కూతురిని బలితీసుకున్నాయంటూ తండ్రి రాజయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

More Telugu News