Payyavula Keshav: సీమెన్స్ సంస్థ ఏపీ బడ్జెట్ కంటే ఆరు రెట్లు ఎక్కువ వ్యాపారం చేస్తోంది: పయ్యావుల

  • స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్
  • ప్రభుత్వ ఆరోపణలను తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్న టీడీపీ నేతలు
  • మీడియా ముందుకు వచ్చిన పయ్యావుల కేశవ్
  • ఏపీ సీఐడీ కోర్టులను సైతం తప్పుదోవ పట్టించిందని విమర్శలు
Payyavula Keshav slams AP govt on Skill Development issue

టీడీపీ సీనియర్ నేత, ప్రజాపద్దుల కమిటీ చైర్మన్ పయ్యావుల కేశవ్ టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంలో మీడియా ముందుకు వచ్చారు. చంద్రబాబుపై ఏపీ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలకు ఆయన మీడియా ముఖంగా బదులిచ్చారు. రాష్ట్రంలో వారం రోజుల క్రితం చంద్రబాబునాయుడును అన్యాయంగా, అక్రమంగా అరెస్టు చేశారని, చేయని నేరానికి ఆయనను జైల్లో వేశారని  పయ్యావుల మండిపడ్డారు. 

"ఏపీ సీఐడీ కోర్టులను సైతం తప్పుదోవ పట్టించింది. అసత్యాల్ని విపరీతంగా ప్రచారం చేశారు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి, సంజయ్ లు కలిసి చంద్రబాబుపై విపరీతమైన అసత్యాలు వల్లెవేశారు. సీమెన్స్ ఇండస్ట్రియల్ సాఫ్ట్ వేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కి సీమెన్స్ కి సంబంధం లేదని నిరూపించగలరా? 

సీమెన్స్ ఇండస్ట్రియల్ సాఫ్ట్ వేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనేక దేశాల్లో ఉంది. సీమెన్స్ కి, సీమెన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కి సంబంధం లేదని ఎలా చెప్పగలరు. ఒక దొంగ ట్రాఫిక్ యూనిఫామ్ వేసుకొని ట్రాఫిక్ చలానా వసూలు చేస్తే ఊరుకుంటారా? వారం లోపలనే పట్టుకుంటారు. సీమెన్స్ ఏజీ  సంస్థ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ కన్నా ఆరు రెట్లు ఎక్కువ  రెట్లు వ్యాపారం చేస్తోంది. అలాంటి సంస్థ పేరు వేరేవారు వాడుకుంటే ఆ సంస్థ చూస్తూ ఊరుకుంటుందా? ఇవన్నీ ఆలోచించాలి. రాష్ట్ర ప్రభుత్వానికి అంత పరిజ్ఞానం లేదనిపిస్తోంది. 

చంద్రబాబుపై బురద చల్లాలని వైసీపీ నాయకుల మాటలు విని తప్పుడు సమాచారాన్ని పదే పదే చెబుతున్నారు. సీమెన్స్ ఏజీ మాకు లేఖ రాసిందని తప్పుడు సమాచారమిస్తున్నారు. రాసి ఉంటే ఆ లేఖను వెంటనే బయట పెట్టాలి. వారి స్టాక్ హోల్డింగ్ రిపోర్టు కూడా బయట పెట్టాలి. టీడీపీ నాయకుల బ్యాంక్ అకౌంట్లు వైసీపీ నాయకులు తెలుసుకున్నట్లు ఇది కూడా తెలుసుకోవాలి. సీమెన్స్ ఏజీ వెబ్ సైట్ కెళ్లి అఫిషియల్ డాక్యుమెంట్ తీసుకోవాలి.

ఏపీలోనే కాకుండా హైదరాబాద్ లో కూడా సీమెన్స్ విషయంలో చంద్రబాబుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సీమెన్స్ అనేది ఒరిజనల్ సంస్థ. ప్రభుత్వానికి స్కిల్ డెవలప్ మెంట్ పై అవగాహన లేదు. చంద్రబాబుతోనే కాదు రాష్ట్రంలోని యువతీ యువకుల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంది. ప్రభుత్వం చేసిన ఈ నష్టంతో ఇంకో కంపెనీ ఆంధ్ర రాష్ట్రం వైపు తిరిగి చూడదు. 

చంద్రబాబు యువతకు ఉద్యోగాలు రావాలనే తపనతో పనిచేశారు. వైసీపీ దీన్ని బూడిదపాలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా నడుస్తున్న ప్రాజెక్టును గుర్తించలేకపోయారంటే కళ్లుండి చూడలేని గుడ్డివారు వైసీపీ నాయకులు. లక్షలాదిమంది జీవితాలను నేడు నాశనం చేశారు. అబ్దుల్ కలాం పొగిడిన కంపెనీనే ఇది ఫేక్ కంపెనీ, సూట్ కేస్ కంపెనీ అనడం వారి అవివేకం. 

మేం సీఐడీ, జగన్ సర్కార్ లేవనెత్తిన అన్ని ఆరోపణలను ఆధారాలతో సహా ఎండగడతాం. స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ కు సంబంధించి మొత్తం 35 డాక్యుమెంట్ల ద్వారా సీఐడీ సంజయ్, పొన్నవోలు, వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణల్నీ అవాస్తవాలని ఆధారాలతో సహా నిరూపిస్తాం" అని పయ్యావుల స్పష్టం చేశారు.

More Telugu News