Nakka Anand Babu: సజ్జల, సీఐడీ చీఫ్ వ్యాఖ్యలకు పూర్తి వివరాలతో కౌంటర్ ఇచ్చిన నక్కా ఆనంద్ బాబు

  • స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్
  • ఇవాళ మీడియా ముందుకు వచ్చిన సజ్జల, సీఐడీ చీఫ్ సంజయ్
  • సజ్జల, సీఐడీ చీఫ్ పాత కథనే కొత్తగా చెప్పే ప్రయత్నం చేశారన్న ఆనంద్ బాబు
  • డిజైన్ టెక్ ఎండీ వాస్తవాలు బయటపెట్టడంతో ముచ్చెమటలు పట్టాయని వెల్లడి
Nakka Anand Babu counters Sajjala and CID Chief Sanjay claims on Chandrababu

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఏపీ సీఐడీ డీజీ సంజయ్ కుమార్ మీడియా సమావేశాల్లో చంద్రబాబుపై ఆరోపణలు గుప్పించారు. దీనిపై టీడీపీ సీనియర్ నేత నక్కా ఆనంద్ బాబు దీటుగా బదులిచ్చారు. చేసిన తప్పులు, వాస్తవాలు కప్పిపుచ్చడానికే సకల శాఖల మంత్రి సజ్జల, సీఐడీ చీఫ్ పాత కథనే కొత్తగా వల్లె వేసే ప్రయత్నం చేశారని విమర్శించారు. తాము బయటపెట్టిన వాస్తవాలపై స్పందించే ధైర్యం ఇద్దరికీ ఉందా? అని నక్కా ఆనంద్ బాబు సవాల్ విసిరారు. 

డిజైన్ టెక్ సంస్థ ఎండీ వికాస్ ఖాన్విల్కర్‌ వాస్తవాలు బయటపెట్టడంతో ప్రభుత్వం, సీఐడీకి ముచ్చెమటలు పట్టాయని అన్నారు. ఈడీ విచారణలో వాస్తవాలు చెప్పామని ఖాన్విల్కర్‌ చెప్పడం ప్రభుత్వానికి, సీఐడీకి మింగుడు పడలేదని అన్నారు. 

“సీఐడీ చీఫ్ సంజయ్ సాయంత్రం 5 గంటలకు విలేకరులతో మాట్లాడతాడని చెప్పారు. కానీ అతని స్థానంలో సజ్జల వచ్చి డ్రాయింగ్ మాస్టర్ పిల్లలకు పాఠాలు చెప్పినట్టు ఉన్నవి లేనివీ పోగేసి పాత అంశాలనే కొత్తగా చెప్పే ప్రయత్నం చేశాడు. ఆయన తర్వాత సంజయ్ మీడియా ముందుకొచ్చి చంద్రబాబు ఏమైనా స్పెషలా అంటూ వ్యంగ్యంగా మాట్లాడాడు. సంజయ్, జగన్ రెడ్డి, ఈ ప్రభుత్వం చంద్రబాబుని జైల్లో పెట్టి శునకానందం పొందినంత మాత్రాన ఆయన స్థాయి తగ్గదు. 

సీఐడీ రిమాండ్ రిపోర్ట్ లోని పేజీ నెం-21లో ప్రాజెక్ట్ అమలుకు కేటాయించిన డబ్బు దుర్వినియోగం అయినట్టు చెప్పలేకపోయారు. డబ్బు ఎటునుంచి ఎటుపోయిందనేది కూడా స్పష్టం చేయలేక పోయారు. సీఐడీ చీఫ్ సంజయ్, డీఐజీ ఇద్దరూ ఒకే వంటకం వండి వార్చే ప్రయత్నం చేసి నగుబాటుకు గురయ్యారు. ఏ షెల్ కంపెనీల ద్వారా స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ నిధులు పక్కదారి పట్టాయని ప్రశ్నిస్తే సంజయ్ నుంచి సమాధానం లేదు. 

మొత్తం ప్రాజెక్ట్ లో ఏపీ ప్రభుత్వం, సీమెన్స్ సంస్థ, డిజైన్ టెక్ లు మాత్రమే భాగస్వాములైతే షెల్ కంపెనీలు ఎక్కడినుంచి వచ్చాయో సంజయ్ చెప్పాలి. ఇలా సమాధానం లేని అనేక ప్రశ్నలకు సీఐడీ చీఫ్ సంజయ్ పొంతన లేని సమాధానాలు చెప్పి ముఖం చాటేశాడు" అని ఎద్దేవా చేశారు.

సీఐడీ చీఫ్ ఆరోపణలు.... టీడీపీ వెల్లడించిన వాస్తవాలు. 

1. ఆరోపణ: నిధులు దుర్వినియోగం అయ్యాయి.


వాస్తవం: రాష్ట్రంలో 36 TSDI (టెక్నికల్ స్కిల్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌లు) మరియు 6 COE లు (సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్) కేంద్రాలు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాయని జగన్ రెడ్డి ప్రభుత్వంలో సీనియర్ అధికారిగా ఉన్న అర్జా శ్రీకాంత్ ధ్రువీకరించారు. 

స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ పరిధిలోని శిక్షణా కేంద్రాలన్నింటినీ సీమెన్స్-డిజైన్ టెక్ సంస్థలనుంచి సంబంధిత కాలేజీలకు హ్యాండ్ హోల్డింగ్ పీరియడ్ తర్వాత అప్పగించడం కూడా జగన్ రెడ్డి హయాంలో ఆగస్టు-2021 నుంచే జరిగింది. 

ఐఐఐటీ ఇడుపులపాయలో ఇన్‌స్టిట్యూట్‌ కు అన్ని రకాల పరికరాలు మరియు సాఫ్ట్‌వేర్‌లు సక్రమంగా సరఫరా చేయబడ్డాయని మరియు పూర్తిగా పని చేసే స్థితిలో ఉన్నాయని లిఖితపూర్వకంగా సదరు ట్రిపుల్ ఐటీ వారు లేఖ కూడా ఇచ్చారు.  

లేఖతో పాటు పరికరాల వివరాలను ధ్రువీకరిస్తూ స్టాక్ రిజిస్టర్లపై  సంతకం కూడా చేశారు. ఇంత స్పష్టంగా శిక్షణా కేంద్రాల వివరాలు, వాటిలోని పరికరాలు, సాఫ్ట్ వేర్ కళ్లముందు కనిపిస్తుంటే అవినీతికి స్థానం ఎక్కడుందో సీఐడీ చీఫ్ సమాధానం చెప్పాలి.

2. సీఐడీ ఆరోపణ: స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కు కేబినెట్ అనుమతి లేదు

వాస్తవం: స్కిల్ కార్పొరేషన్ ఏర్పాటుకు అప్పటి ప్రభుత్వ కార్యదర్శి గిరిధర్ అర్మానే నోట్ పంపితే... ప్రధాన కార్యదర్శి చర్యలు ప్రారంభించారు. 2014లో కార్పొరేషన్ ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన ఐపీఎస్ అధికారి గిరిధర్ నేడు కేంద్ర రక్షణశాఖలో కీలకపాత్రలో ఉన్నారు. బిజినెస్ మాన్యువల్ గురించి గిరిధర్ కంటే  సీఐడీ చీఫ్ సంజయ్ కు ఎక్కువ తెలుసా?

3. సీఐడీ ఆరోపణ: ప్రైవేట్ వ్యక్తికి మూడు పదవులు ఇచ్చారు

వాస్తవం: కొత్తగా స్కిల్ డెవలప్ మెంట్  కార్పొరేషన్ ఏర్పాటు చేసినప్పుడు ఒక వ్యక్తే ఉన్నాడు.. అతనికి బాధ్యతలు అప్పగించడం జరుగుతుంది. గంటా సుబ్బారావుకి బాధ్యతలు అప్పగించేటప్పుడు జీవోలో స్పష్టంగా చెప్పడం జరిగింది. పాలనా పరమైన నిర్ణయాలు, ఆర్థికపరమైన నిర్ణయాల్లో ఎటువంటి జోక్యం ఉండదని,  కీలకమైన నిర్ణయాల్లో ఆయన ప్రమేయముండదని కూడా చెప్పడం జరిగింది. కేవలం శిక్షణా కార్యక్రమాలకు సంబంధించి మాత్రమే ఆయన జోక్యం ఉంటుందని ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోలో స్పష్టంగా పేర్కొనడం జరిగింది.

4. సీఐడీ ఆరోపణ: షెల్ కంపెనీల ద్వారా నిధులు దారి మళ్లించారు 

వాస్తవం: టీడీపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది సీమెన్స్, డిజైన్ టెక్ సంస్థలతో మాత్రమే. అలాంటప్పుడు షెల్ కంపెనీలతో లావాదేవీలు ఎలా జరిగాయో సీఐడీ చీఫ్ చెప్పాలి. GST పన్ను ఎగవేతకు సంబంధించిన సమస్య, డిజైన్ టెక్ నుండి జరిగిన ఆ  సంస్థ వ్యక్తిగత వ్యవహారం. దానితో ప్రభుత్వానికి ఏం సంబంధమని స్వయంగా డిజైన్ టెక్ ఎండీ వికాస్ ఖాన్విల్కరే అంటున్నారు. 

కొన్ని కంపెనీలకు కొన్ని నకిలీ ఇన్‌వాయిస్‌లను రూపొందించడం GST పన్ను క్రెడిట్‌ను క్లెయిమ్ చేయడం. ఏదైనా కంపెనీ పన్ను చెల్లించకుంటే ఏపీ ప్రభుత్వం ఎలా బాధ్యత వహిస్తుందో సీఐడీ చెప్పాలి.  మా వైపు నుండి మేము 371 కోట్ల మొత్తాన్ని విడుదల చేశాము, దానిలోనే అవసరమైన GST పన్ను సొమ్ము కూడా ఉంటుంది, కాబట్టి ప్రభుత్వం కట్టాల్సిన పన్ను బాధ్యత అక్కడితో ముగుస్తుంది. ఈ చిన్న విషయం తెలియకుండానే సంజయ్ సివిల్ సర్వీస్ అధికారి అయ్యారా? 

5. సీఐడీ ఆరోపణ: హవాలా ద్వారా నిధుల మళ్లింపు

వాస్తవం: రిమాండ్ రిపోర్టులో ఎక్కడా చంద్రబాబు పేరులేదు. అలానే ఆయన కుటుంబ సభ్యులు లేదా వారికి చెందిన కంపెనీలలో ఎవరికీ లింక్ చేసేలా మనీ ట్రయల్ జరిగినట్టు సీఐడీ ఎక్కడా సాక్ష్యాలను సమర్పించలేదు. 

రిమాండ్ రిపోర్ట్ లోని 21వ పేజీ 10వ పేరాలో కూడా ఇలా వ్రాసారు, “అస్పష్టంగా నగదుగా డ్రా చేయబడిన మరియు వికాస్ ఖాన్విల్కర్‌ ద్వారా పార్క్ చేసిన ముగింపు డబ్బులను నిర్ధారించాల్సిన అవసరం ఉంది” అని. డబ్బు జాడ ఇప్పటివరకు నిర్ధారించబడనప్పుడు నిధుల దుర్వినియోగం జరిగిందని ఎలా ఆరోపిస్తారు... దాన్ని చంద్రబాబుకి ఎలా లింక్ చేస్తారు?

6. సీఐడీ ఆరోపణ: ఫైల్స్ మాయం అయ్యాయి

వాస్తవం:  గతంలో జీవో నెం-8 కి సంబంధించిన నోట్ ఫైల్ పోయిందన్నారు. ఇప్పుడు జీవో- 4 కు సంబంధించిన నోట్ ఫైల్ పోయిందంటున్నారు. ఇప్పుడు జీవోలు అందుబాటులో ఉన్నాయి. అవి ఇచ్చిన అధికారులు అందరూ వైసీపీ ప్రభుత్వంలోనే కీలక స్థానాల్లో ఉన్నారు. అజయ్ కల్లం రెడ్డి, ప్రేమచంద్రారెడ్డిని ఎందుకు విచారించరు? వాటికి సంబంధించి ఏది అడిగినా వారు వివరణ ఇస్తారు. 

నోట్ ఫైల్స్ మాయం అయ్యాయని చెప్పడం ఉత్త బుకాయింపు తప్ప మరోటికాదు. ఈ ప్రభుత్వమే వాటిని దాచి పనికి రాని ఆరోపణలు చేస్తోంది. టీడీపీ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడుని  కావాలనే ఈ కేసులో ఇరికించడానికి ప్రయత్నం చేస్తున్నారు.

7. సీఐడీ ఆరోపణ: టెండర్లు లేవు 

వాస్తవం: సీమెన్స్ సంస్థ స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ లో 90% గ్రాంట్‌పై ఆధారపడి ఉంది., కాబట్టి నాటి ప్రభుత్వం ఏదైనా గ్రాంట్‌గా స్వీకరిస్తున్నప్పుడు టెండర్లను ఫ్లోట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ సాఫ్ట్‌వేర్ సీమెన్స్ యొక్క పేటెంట్ సాఫ్ట్‌వేర్. జగన్‌రెడ్డి బైజూస్‌తో ఒప్పందం చేసుకున్నప్పుడు టెండర్లు పిలిచారా? ముఖ్యమంత్రి బైజూస్ రవీంద్రన్‌ని, కంటెంట్‌ అందించిన అతని విశాల హృదయం మరియు దాతృత్వాన్ని అభినందించిన జగన్ బైజూస్ సంస్థ దివాళా తీయడంపై బాధ్యత వహిస్తాడా? 

8. సీఐడీ ఆరోపణ: జీవోలకు, ఒప్పందాలకు పొంతన లేదు

వాస్తవం: సీమెన్స్ సంస్థ తన ఖరీదైన సాప్ట్‌వేర్‌ను 95 నుండి 97 శాతం డిస్కౌంట్‌లతో ప్రభుత్వాలకు, యూనివర్సిటీలకు విక్రయించి వారి ద్వారా యువతకు శిక్షణను ఇచ్చి తమ సాప్ట్‌వేర్ అమ్మకాలను పెంచుకోవడానికి అనేక దేశాలతో పాటు మనదేశంలోని అనేక రాష్ట్రాలలో ఈ కార్యక్రమం చేపట్టింది.  

ఏమీలేకుండానే ఏదో జరిగిందంటూ విపరీత బాష్యాలు చెప్పి కొందరు అధికారులతో బలవంతంగా స్టేట్‌మెంట్లను ఇప్పించి దీనిపై వ్యాఖ్యానాలు చేయడం హాస్యాస్పదం అవుతుంది. వాస్తవాలను కప్పిపుచ్చి, చేసిన తప్పుని అడ్డగోలుగా సమర్థించుకోవడానికే సజ్జల, సీఐడీ చీఫ్ సంజయ్ మీడియా ముందు వక్రభాష్యాలు పలికారు” అంటూ ఆనంద్ బాబు మండిపడ్డారు.

More Telugu News