Loksatta: ADR రిపోర్ట్: క్రిమినల్ కేసులు, అత్యధిక ఆస్తులు కలిగిన జాబితాలో తెలుగు రాష్ట్రాల ఎంపీలు

  • 25 శాతం మందికి పైగా ఎంపీలు తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటున్నారు
  • క్రిమినల్ కేసుల్లో కేరళ టాప్
  • ఆస్తుల విషయంలో టాప్‌లో తెలంగాణ ఎంపీలు
  • వైసీపీ నుంచి 13 మంది ఎంపీలపై క్రిమినల్ కేసులు
40 Per Cent Sitting MPs Have Criminal Cases

పార్లమెంట్ ఉభయ సభల్లోని 40 శాతం మంది సిట్టింగ్ ఎంపీలపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ఏడీఆర్ సంస్థ వెల్లడించింది. ఇందులో 25 శాతం మందిపై (194 మంది ఎంపీలు) హత్య, హత్యాయత్నం, కిడ్నాప్, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడిన కేసులు ఉన్నాయని పేర్కొంది. నేషనల్ ఎలక్షన్ వాచ్ సంస్థతో కలిపి సిట్టింగ్ ఎంపీల అఫిడవిట్‌లను పరిశీలించి, వివరాలను వెల్లడించింది. 

ఉభయ సభల్లో 776 మంది ఎంపీలు ఉండగా, 763 మంది ఎంపీల ఎన్నికల అఫిడవిట్లను విశ్లేషించింది. మిగతా స్థానాలు ఖాళీగా ఉండటం లేదా అందుబాటులో లేకపోవడం జరిగింది. 763 మంది ఎంపీల్లో 306 శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని తెలిపింది. అలాగే ఇరుసభల్లోని ఎంపీల సగటు ఆదాయం రూ.38.33 కోట్లుగా ఉంది. ఇందులో 53 మంది అంటే 7 శాతం మంది బిలియనీర్లు.

ఉభయ సభల్లో క్రిమినల్ కేసులు నమోదైన వారిలో రాష్ట్రాలవారీగా చూస్తే కేరళ నుంచి 29 మంది ఎంపీలకు గాను 23 మందిపై (79 శాతం), బీహార్ నుంచి 56 మందికి గాను 41 (73 శాతం), మహారాష్ట్ర నుంచి 65 మందికి 37 (57 శాతం), తెలంగాణ నుంచి 24 మందికి గాను 13 (54 శాతం), ఢిల్లీ నుంచి 10 మందికి గాను ఐదుగురిపై (50 శాతం) క్రిమినల్ కేసులు ఉన్నాయి.

తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న వారిలో బీహార్ నుంచి 28 మంది, తెలంగాణ నుంచి 9 మంది, కేరళ నుంచి 10 మంది, మహారాష్ట్ర నుంచి 22 మంది, ఉత్తర ప్రదేశ్ నుంచి 37 మంది ఉన్నారు.

బీజేపీ నుంచి 139 మంది, కాంగ్రెస్ నుంచి 43 మంది, టీఎంసీ నుంచి 14 మంది, ఆర్జేడీ నుంచి ఐదుగురు, సీపీఐ(ఎం) నుంచి ఆరుగురు, వైసీపీ నుంచి 13 మంది క్రిమినల్ కేసులు కలిగి ఉన్నారు.

పార్టీల వారీగా చూస్తే బీజేపీ నుంచి 98 మంది (25 శాతం), కాంగ్రెస్ నుంచి 26 మంది (32 శాతం), టీఎంసీ నుంచి ఏడుగురు (19 శాతం), ఆర్జేడీ నుంచి ముగ్గురు (50 శాతం), సీపీఐ(ఎం) నుంచి ఇద్దరు (25 శాతం), ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఒకరు (9 శాతం), వైసీపీ నుంచి 11 మంది (35 శాతం), ఎన్సీపీ నుంచి ఇద్దరు  (25 శాతం) తీవ్రమైన క్రిమినల్ కేసులు కలిగి ఉన్నారు. 

ఇక ఎంపీల ఆస్తుల విషయానికి వస్తే తెలంగాణ 24 మందితో మొదటి స్థానంలో ఉంది. సగటు ఆస్తి రూ.262.26 కోట్లుగా ఉంది. ఆ తర్వాత మధ్యప్రదేశ్ నుంచి 36 మంది (సగటున రూ.150.76 కోట్లు), పంజాబ్ నుంచి 20 మంది (సగటున 88.94 కోట్లు) ఉన్నారు. అందరి కంటే తక్కువగా లక్షద్వీప్ ఎంపీ రూ.9.38 లక్షలతో చివరి స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత త్రిపుర ముగ్గురు ఎంపీల సగటు ఆస్తి రూ.1.09 కోట్లు, మణిపూర్ నుంచి ముగ్గురి సగటు ఆస్తి రూ.1.12 కోట్లుగా ఉంది.

బీజేపీ ఎంపీల సగటు ఆస్తి రూ.18.31 కోట్లు, కాంగ్రెస్ ఎంపీల సగటు ఆస్తి రూ.39.12 కోట్లు, టీఎంసీ ఎంపీల సగటు ఆస్తి రూ.8.72 కోట్లు, వైసీపీ ఎంపీల సగటు ఆస్తి రూ.153.76 కోట్లు, టీఆర్ఎస్ ఎంపీల సగటు ఆస్తి రూ.383.51 కోట్లు, ఎన్సీపీ ఎంపీల సగటు ఆస్తి రూ.30.11 కోట్లు, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీల సగటు ఆస్తి రూ.119.84 కోట్లుగా ఉంది.

53 మంది బిలియనీర్ ఎంపీలలో తెలంగాణ నుంచి ఏడుగురు, ఆంధ్రప్రదేశ్ నుంచి 9 మంది, ఢిల్లీ నుంచి ఇద్దరు, పంజాబ్ నుంచి నలుగురు, ఉత్తరాఖండ్ నుంచి ఒకరు, మహారాష్ట్ర నుంచి ఆరుగురు, కర్ణాటక నుంచి ముగ్గురు ఉన్నారు. వీరంతా రూ.100 కోట్లకు పైగా ఆస్తిని కలిగి ఉన్నారు. రూ.100 కోట్ల ఆస్తిని కలిగి ఉన్న ఎంపీలలో బీజేపీ నుంచి 14 మంది, కాంగ్రెస్ నుంచి ఆరుగురు, బీఆర్ఎస్ నుంచి ఏడుగురు, వైసీపీ నుంచి ఏడుగురు ఉన్నారు.

More Telugu News