Vishva Karthikeya: బాలనటుడి నుంచి హీరోగా.. 20 ఏళ్లు పూర్తి చేసుకున్న విశ్వ కార్తికేయ!

  • బాలనటుడిగా 50 సినిమాలు చేసిన విశ్వ కార్తికేయ
  • 'జై సేన'తో హీరోగా ఎంట్రీ 
  • తాజా చిత్రంగా 'కలియుగం పట్టణం'లో
  • త్వరలోనే విడుదల కానున్న సినిమా  

Kaliyugam Pattanamlo movie update

బాల నటుడిగా కెరీర్ మొదలుపెట్టి విశ్వ కార్తికేయ నేటితో 20 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. బాలకృష్ణ, రాజశేఖర్, రాజేంద్ర ప్రసాద్ ఇలా ఎంతో మందితో కలిసి బాలనటుడిగా దాదాపు 50కి పైగా చిత్రాల్లో నటించాడు. ఆయన నటించిన చిత్రాల్లో 'గోరింటాకు' ..  'జానకి వెడ్స్ శ్రీరామ్'.. 'విష్ణు' .. 'లేత మనసులు' .. 'శివ శంకర్' .. 'అధినాయకుడు' వంటివి ఉన్నాయి. నంది అవార్డు, ఇతర అంతర్జాతీయ అవార్డులు, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అవార్డులు సొంతం చేసుకున్నాడు.

'జై సేన' చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు విశ్వ కార్తికేయ. కళాపోషకులు, అల్లంత దూరాన వంటి సినిమాల్లో మంచి నటనను కనబరిచాడు. ఇప్పుడు 'కలియుగం పట్టణంలో' అంటూ ఓ ఇంటెన్స్ ఎమోషనల్ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నాడు. నాని మూవీ వర్క్స్ మరియు రామా క్రియేషన్స్ ప్రొడక్షన్ అధినేతలు డా. కే. చంద్ర ఓబుల్ రెడ్డి, జీ మహేశ్వర రెడ్డి, కట్టం రమేష్  సంయుక్తంగా కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

ఈ మూవీలో ఆయూషి పటేల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. రమాకాంత్ రెడ్డి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్‌కు మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సింగిల్ షెడ్యూల్‌లోనే సినిమాను పూర్తి చేయబోతున్నారు. నటుడిగా విశ్వ కార్తికేయ 20 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో టీం అంతా కంగ్రాట్స్ తెలిపింది.

More Telugu News