చంద్రబాబు రిమాండ్ రిపోర్టులో లోకేశ్, అచ్చెన్నాయుడు పేర్లు చేర్చిన సీఐడీ

  • స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టయిన టీడీపీ అధినేత
  • విజయవాడ ఏసీబీ కోర్టు ఎదుట చంద్రబాబు హాజరు
  • 15 రోజుల కస్టడీ కోరిన సీఐడీ
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. శనివారం తెల్లవారుజామున అరెస్టయిన బాబు ప్రస్తుతం విజయవాడలోని ఏసీబీ కోర్టులో ఉన్నారు. రిమాండ్‌ను తిరస్కరించాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదిస్తుండగా, ఆయనను 15 రోజులపాటు కస్టడీకి అనుమతించాలని సీఐడీ తరపు న్యాయవాదులు కోరుతున్నారు. ఇరు పక్షాల మధ్య హోరాహోరీ వాదనలు కొనసాగుతున్నాయి.

ఈ కేసులో సీఐడీ కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో నారా లోకేశ్, ఏపీ టీడీపీ అధ్యక్షుడు కె. అచ్చెన్నాయుడు పేర్లను కూడా చేర్చింది. చంద్రబాబు సన్నిహితుడు కిలారు రాజేశ్ ద్వారా లోకేశ్‌కు డబ్బులు అందినట్లు రిమాండ్ రిపోర్టులో సీఐడీ ఆరోపించింది. ఈ కేసులో విజయవాడ ఏసీబీ న్యాయస్థానం ముందు చంద్రబాబు స్వయంగా తన వాదనలు వినిపించారు. దాంతో, తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Andhra Pradesh
Chandrababu
Nara Lokesh
Kinjarapu Acchamnaidu
arrest

More Telugu News