K Kavitha: సోనియా గాంధీని నిలదీసిన ఎమ్మెల్సీ కవిత అసంతృప్తి

  • ప్రత్యేక సమావేశాల్లో మహిళా బిల్లుపై ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్న
  • వివిధ ముఖ్య జాతీయ అంశాల్లో మహిళా బిల్లు ఎందుకు లేదని నిలదీత
  • కాంగ్రెస్‌కు మహిళా బిల్లుపై చిత్తశుద్ధి లేదని విమర్శ
Kavitha unhappy with Sonia Gandhi

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళా బిల్లు గురించి చర్చించాలని ఎందుకు ప్రస్తావించలేదని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రశ్నించారు. మహిళా బిల్లుపై కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధిలేదని మరోసారి వెల్లడైందన్నారు. వివిధ ముఖ్య జాతీయ అంశాల్లో మహిళా బిల్లు ఎందుకు లేదని ప్రశ్నించారు. ప్రత్యేక సమావేశాల్లో చర్చించేందుకు తొమ్మిది అంశాలను ప్రతిపాదిస్తూ ప్రధాని మోదీకి సోనియా లేఖ రాసిన విషయం తెలిసిందే. ఇందులో మహిళా బిల్లు ప్రస్తావన లేదు. ఈ అంశంపై కవిత అసంతృప్తి వ్యక్తం చేశారు.

తొమ్మిది అంశాలతో పాటు మహిళా బిల్లును పొందుపర్చకపోవడాన్ని కవిత తీవ్రంగా తప్పుబట్టారు. ప్రధానికి రాసిన లేఖలో మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి ఎందుకు ప్రస్తావించలేదో చెప్పాలన్నారు. చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశం కాదా? అని ప్రశ్నిస్తూ.. మహిళా బిల్లును కాంగ్రెస్ పూర్తిగా విస్మరిస్తున్నట్టు తేటతెల్లమైందని వ్యాఖ్యానించారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించే ముఖ్యమైన మహిళా బిల్లుపై కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదన్నారు.

More Telugu News