KTR: తెలంగాణకు మరో భారీ పెట్టుబడి.. రూ.700 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్న దుబాయ్ సంస్థ

  • కేటీఆర్‌తో నాఫ్కో సీఈవో ఖాలీద్ అల్ ఖతిబ్ బృందం భేటీ
  • తెలంగాణలో అగ్నిమాపక సామగ్రి తయారు చేస్తామని వెల్లడి
  • భారత్ డిమాండ్‌కు సరిపోయేలా తెలంగాణలో అగ్నిమాపక సామగ్రి తయారీ ప్లాంట్
Naffco to invest RS 700 crores in Telangana

యూఏఈ దిగ్గజ సంస్థ నాఫ్కో (NAFFCO) తెలంగాణలో రూ.700 కోట్ల భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. అగ్నిమాపక సామగ్రి తయారీలో నాఫ్కో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. దుబాయ్‌లో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్‌తో కంపెనీ సీఈవో ఖాలిద్ అల్ ఖతిబ్ ప్రతినిధి బృందం సమావేశమైంది. తెలంగాణలో తమ అగ్నిమాపక సామగ్రిని తయారు చేస్తామని, ఇందుకు రూ.700 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు సంస్థ తెలిపింది.

తెలంగాణ సహా భారత్ విస్తృతంగా అభివృద్ధి చెందుతోన్న నేపథ్యంలో అగ్నిమాపక సామగ్రి, అగ్నిమాపక సేవల అవసరం భవిష్యత్తులో భారీగా పెరుగుతుందనే విశ్వాసం తమకు ఉందని నాఫ్కో పేర్కొంది. తెలంగాణలో ఏర్పాటు చేయబోయే అగ్నిమాపక సామగ్రి తయారీ ప్లాంట్ భారత్ డిమాండ్‌కు సరిపోతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

అదే సమయంలో తెలంగాణలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్‌తో కలిసి అంతర్జాతీయ స్థాయి ఫైర్ సేఫ్టీ ట్రెయినింగ్ అకాడమీ ఏర్పాటు చేయాలన్న కేటీఆర్ ప్రతిపాదనకు కంపెనీ అంగీకారం తెలిపింది. ఈ ట్రైనింగ్ అకాడమీ ద్వారా దాదాపు 100కు పైగా దేశాలలో కార్యకలాపాలు నిర్వహిస్తోన్న తమ సంస్థ నైపుణ్యాన్ని, అగ్నిమాపక శిక్షణను తెలంగాణ కేంద్రంగా అందిస్తామని సంస్థ సీఈవో తెలిపారు. కాగా, ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా దేశాల్లో సేవలు అందిస్తోన్న నాఫ్కో తెలంగాణలో ఇన్వెస్ట్ చేయనున్నట్లు కేటీఆర్ ట్వీట్ చేశారు.

More Telugu News