Actor Vishal: జాతీయ అవార్డులపై ప్రశ్న.. చెత్తబుట్టలో వేస్తానంటూ నటుడు విశాల్ రిప్లై

  • విశాల్ నటించిన ‘మార్క్ ఆంటోని’ ఈ నెల 15న విడుదల 
  • చెన్నైలో ఓ కార్యక్రమంలో మీడియా ప్రశ్నలకు నటుడు విశాల్ స్పందన
  • తనకు అవార్డులపై నమ్మకం లేదని వ్యాఖ్య
  • జీవితంలో ఏదైనా జరగొచ్చంటూ తన రాజకీయ ఎంట్రీపై స్పందన
Actor Vishal says he would dump awards if he ever given one

తనకు అవార్డులపై ఎటువంటి నమ్మకం లేదని ప్రముఖ నటుడు విశాల్ తేల్చి చెప్పారు. ఒక వేళ అవార్డులు వస్తే వాటిని చెత్తబుట్టలో పడేస్తానని నిర్మొహమాటంగా తేల్చి చెప్పారు. ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో విశాల్ నటించిన చిత్రం ‘మార్క్ ఆంటోని’ ఈ నెల 15న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చెన్నైలోని ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన జాతీయ అవార్డులపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చారు. 

‘‘అవార్డులపై నాకు అస్సలు నమ్మకం లేదు. ప్రజలందరూ కలిసి ఇచ్చేదే నిజమైన అవార్డు. ప్రేక్షకుల ఆశీస్సులతో ఇన్నేళ్లపాటు పరిశ్రమలో నిలదొక్కుకుంటూ చిత్రాల్లో నటిస్తున్నా. నిజానికి అదే నాకు పెద్ద అవార్డు. ఒకవేళ నేను నటించిన చిత్రాలకు అవార్డులు వచ్చినా వాటిని చెత్తబుట్టలో పడేస్తా’’ అని పేర్కొన్నారు. 

తన రాజకీయ రంగ ప్రవేశంపై కూడా విశాల్ స్పందించారు. ‘‘జీవితంలో ఏదైనా జరగొచ్చు. ఒకప్పుడు నటీనటుల సంఘం ప్రధాన కార్యదర్శిగా ఉన్న రాధారవి నన్ను సంఘం సభ్యుడిగా చేరమని పలుమార్లు అడిగారు. ఆ తర్వాతే చేరాను. కొంత కాలానికి అదే సంఘంలో ఆయనకు పోటీగా ఎన్నికల్లో దిగి ప్రధాన కార్యదర్శిగా గెలుపొందా. అదే విధంగా భవిష్యత్తులో ఏదైనా జరగొచ్చు. మన చేతుల్లో ఏం లేదు’’ అని వ్యాఖ్యానించారు.

More Telugu News