KA Paul: దీక్ష భగ్నం చేసిన పోలీసులు.. సీఐ కాలర్ పట్టుకున్న కేఏ పాల్

  • విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ పాల్ నిరవధిక దీక్ష
  • దీక్షను భగ్నం చేసి విశాఖ కేజీహెచ్‌కు తరలించిన పోలీసులు
  • కేజీహెచ్ గేట్ వద్ద పోలీసులతో కేఏ పాల్ వాగ్వాదం
  • అడ్డుకోబోయిన సీఐ కాలర్ పట్టుకున్న ప్రజాశాంతి పార్టీ అధినేత
KA Paul touches CM collar in Visakhapatnam

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సోమవారం విశాఖలో నిరవధిక దీక్ష చేపట్టారు. మంగళవారం రెండో రోజుకు చేరుకోవడంతో పోలీసులు ఆయన దీక్షను భగ్నం చేసి, అరెస్ట్ చేసి, కేజీహెచ్‌కు తరలించారు. ఈ సమయంలో కేజీహెచ్ గేట్ వద్ద పోలీసులతో కేఏ పాల్ వాగ్వాదానికి దిగారు. వారితో దురుసుగా ప్రవర్తించారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని, తనకు వైద్యం అవసరం లేదని కేకలు వేశారు. తనను అడ్డుకోబోయిన సీఐ కాలర్ పట్టుకున్నారు. 

కాగా, స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ నిలిపివేయాలంటూ ఆయన రెండు రోజుల క్రితం ప్రభుత్వానికి 48 గంటల గడువు ఇచ్చారు. ఢిల్లీ నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో సోమవారం నిరవధిక దీక్షకు దిగారు. తన అనుచరులతో కలిసి ఆశీల్‌మెట్ట సమీపంలోని ఫంక్షన్ హాలులో దీక్షకు దిగారు. ప్రయివేటీకరణ బిల్లు వచ్చే వరకు దీక్ష కొనసాగుతుందని తెలిపారు. అయితే నేడు పోలీసులు ఆయన దీక్షను భగ్నం చేశారు.

More Telugu News