NTR: ఎన్టీఆర్ బొమ్మతో ఉన్న రూ.100 నాణేల కోసం హైదరాబాద్ మింట్ వద్ద బారులు తీరిన జనం

  • ఎన్టీఆర్ కు విశిష్ట గుర్తింపు
  • మహనీయుడి పేరిట ప్రత్యేకంగా రూ.100 నాణెం
  • నిన్న ఢిల్లీలో నాణెం ఆవిష్కరణ
  • ఎన్టీఆర్ బొమ్మతో ఉన్న నాణేలకు భారీ డిమాండ్
Huge demand for NTR coins

విశ్వ విఖ్యాత నటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శతజయంతి వేళ ఆయన స్మారకార్థం కేంద్ర ప్రభుత్వం రూ.100 నాణేలను ముద్రించడం తెలిసిందే. నిన్న ఈ అపురూప నాణేల ఆవిష్కరణ ఢిల్లీలో జరిగింది. 

ఈ నాణెం ఒక్కొక్కటి గరిష్ఠంగా రూ.4 వేల పైచిలుకు ధరకు మింట్ కాంపౌండ్లలో విక్రయిస్తున్నారు. ఎన్టీఆర్ బొమ్మతో ఉన్న నాణేలను తొలి విడతలో 12 వేలు ముద్రించినట్టు తెలుస్తోంది. 

అయితే, ఈ నాణేలు అందుబాటులోకి వచ్చిన తొలిరోజే భారీ డిమాండ్ నెలకొంది. హైదరాబాదు మింట్ కాంపౌండ్ వద్ద ఎన్టీఆర్ నాణేల కోసం జనాలు బారులు తీరారు. తమ వంతు వచ్చే వరకు ప్రజలు ఓపిగ్గా నిలుచుని ఎన్టీఆర్ నాణేలు సొంతం చేసుకుని మురిసిపోతున్నారు. 

మహనీయుడి పేరిట విడుదల చేసిన నాణేలకు ఈ స్థాయిలో స్పందన ఉండడంతో, కేంద్ర ప్రభుత్వం మలి విడత నాణేల ముద్రణ ప్రారంభించినట్టు తెలుస్తోంది.

More Telugu News