Chandrababu: ఎన్నికలకు ముందే ఈ అక్రమాలు సరిదిద్దాలని ఈసీని కోరాం: చంద్రబాబు

  • ఢిల్లీలో సీఈసీతో ముగిసిన చంద్రబాబు భేటీ
  • దాదాపు గంటపాటు సాగిన సమావేశం 
  • ఓట్ల అక్రమాలపై సాక్ష్యాధారాలన్నీ ఈసీకి అందించామన్న చంద్రబాబు
  • నిబంధనలు ఉల్లంఘించే పార్టీలను రద్దు చేసే అధికారం ఈసీకి ఉందని వెల్లడి
Chandrababu talks to media after meeting with CEC in Delhi

ఢిల్లీలో సీఈసీ రాజీవ్ కుమార్ తో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ ముగిసింది. దాదాపు గంటపాటు ఈ సమావేశం జరిగింది. ఎన్నికల సంఘం కార్యాలయం నుంచి వెలుపలికి వచ్చిన అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. 

రాష్ట్రంలో జరుగుతున్న ఓట్ల అక్రమాలను ఎన్నికల సంఘానికి వివరించామని తెలిపారు. సీఈసీతో పాటు ఇద్దరు ఎలక్షన్ కమిషనర్లను, ఇతర రాష్ట్రాల ఐఏఎస్ లను ఏపీలో పర్యటించాలని కోరామని వెల్లడించారు. రాష్ట్రంలో ఓట్ల అవకతవకలపై ఉన్నతస్థాయి కమిటీ నియమించాలని విజ్ఞప్తి చేశామని వివరించారు. నిబంధనలను ఉల్లంఘించే పార్టీలను రద్దు చేసే అధికారం ఈసీకి ఉందని చంద్రబాబు తెలిపారు. 

ఏపీలో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొని ఉందని, కేవలం ఒక పార్టీకి చెందిన ఓట్లను తొలగించే ఆలోచన రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకు ఎవరికీ రాలేదని అన్నారు. ఓటర్ల తొలగింపుపై సాక్ష్యాధారాలతో సహా ఇప్పటికే చాలాసార్లు పోరాడామని తెలిపారు. 

ఈ ప్రభుత్వం వచ్చిన నాలుగున్నరేళ్లలో నాలుగైదు ఎన్నికలు జరిగాయని చంద్రబాబు వెల్లడించారు. ఒక పార్లమెంటు ఉప ఎన్నిక జరిగితే పెద్ద సంఖ్యలో బోగస్ ఓటరు కార్డులు ముద్రించారని ఆరోపించారు. ఎక్కడికక్కడ ఇష్టానుసారం ఓట్లేస్తుంటే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాం... అయినప్పటికీ చర్యలు తీసుకోలేకపోయారని పేర్కొన్నారు. 

"వీళ్లు పంచాయతీ సచివాలయం అనే ఒక వ్యవస్థను తీసుకువచ్చారు. ఇందులో ఉండే 1.30 లక్షల మందికి బీఎల్వో విధులు, ఎన్నికల విధులు కేటాయిస్తున్నారు. వాలంటీర్ల సాయంతో డేటా సేకరించి ప్రైవేటు ఏజెన్సీకి పంపిస్తున్నారు. ఆ సేకరించిన సమాచారం ద్వారా టీడీపీ, ఇతర పార్టీల ఓటర్లను గుర్తించి వారిని తొలగిస్తున్నారు. వీటన్నింటిని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లాం. 

బీఎల్వోలు ఇంటింటికి వెళ్లకుండా, వాలంటీర్లే ఇంటింటికీ వెళ్లి ఓటర్ల గణన చేపడుతున్నారు. విశాఖలో ఓ విధానం అంటూ లేకుండా 40 వేల ఓట్లను తీసేశారు. మచిలీపట్నంలోనూ 5 వేలకు పైగా ఓట్లను తీసేశారు. చర్యలు తీసుకోవాల్సిందేనని ఎస్ఈఓ స్పష్టం చేసినా అధికారులు అందుకు సిద్ధంగా లేరు. 

ఉరవకొండలో పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ గట్టిగా పోరాడడంతో ఇద్దరు అధికారులను సస్పెండ్ చేశారు. అయితే ఇద్దరు అధికారులను సస్పెండ్ చేసినంత మాత్రాన ఓట్ల అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని భావించడంలేదు. 

దొంగ ఓట్లు చేర్చడం, ఉన్న ఓట్లు తొలగించడం, చనిపోయినవారిని జాబితాలో చేర్చడం... ఇలా 15 లక్షల ఓట్లను తారుమారు చేసినట్టు సాక్ష్యాధారాలతో సహా ముందుకు వచ్చాం. వీటన్నింటినీ ఓ సీడీ రూపంలో పొందుపరిచాం. సున్నా డోర్ నెంబరుతో పెద్ద సంఖ్యలో ఓట్లను జాబితాలో పేర్కొన్నారు. ఎన్నికలకు ముందే ఈ అక్రమాలను సరిదిద్దాలని కోరాం" అని చంద్రబాబు వివరించారు.

More Telugu News