Chandrababu: రేపు ఎన్టీఆర్ చిత్రంతో రూ.100 నాణెం ఆవిష్కరణ... ఢిల్లీ పయనమైన చంద్రబాబు

  • ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల వేళ ప్రత్యేక నాణెం ముద్రించిన కేంద్రం
  • రాష్ట్రపతి భవన్ లో రేపు నాణెం విడుదల
  • చంద్రబాబు, నందమూరి కుటుంబ సభ్యులకు ఆహ్వానాలు
  • తనకు ఆహ్వానం పంపలేదంటూ రాష్ట్రపతికి లేఖ రాసిన లక్ష్మీపార్వతి
Chandrababu leaves for Delhi

టీడీపీ అధినేత చంద్రబాబు హైదరాబాద్ నుంచి ఢిల్లీ బయల్దేరారు. రేపు (ఆగస్టు 28) రాష్ట్రపతి భవన్ లో జరిగే కార్యక్రమంలో చంద్రబాబు కూడా పాల్గొననున్నారు. ఎన్టీఆర్ చిత్రంతో రూపొందించిన రూ.100 నాణేన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం నాడు ఆవిష్కరించనున్నారు. 

ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల నేపథ్యంలో కేంద్రం ఈ ప్రత్యేక నాణేన్ని ముద్రించింది. ఈ నాణెం ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనాలంటూ రాష్ట్రపతి భవన్ వర్గాలు చంద్రబాబుకు ఆహ్వానం పంపాయి. కాగా, ఈ ప్రత్యేక నాణెం ఆవిష్కరణ కార్యక్రమానికి నందమూరి కుటుంబం నుంచి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, పురందేశ్వరి తదితరులకు కూడా రాష్ట్రపతి భవన్ నుంచి ఆహ్వానాలు వెళ్లినట్టు తెలుస్తోంది. 

అయితే, తాను ఎన్టీఆర్ భార్యనని, ఆయన చిత్రంతో ముద్రించిన నాణెం ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనే హక్కు తనకుందని వైసీపీ నేత లక్ష్మీపార్వతి అంటున్నారు. ఈ మేరకు తనకు కూడా ఆహ్వానం పంపాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు లక్ష్మీపార్వతి లేఖ రాశారు. దీనిపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తి కలిగిస్తోంది.

More Telugu News