పాకిస్థాన్ కు వెళ్లనున్న బీసీసీఐ బాస్.. ముంబై దాడుల తర్వాత మొదటిసారి
- బీసీసీఐ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ కు పీసీబీ ఆహ్వానం
- సెప్టెంబర్ 4 నుంచి 7 వరకు పాక్ లో పర్యటన
- లాహోర్ లో వీరికి అధికారిక విందు
రోజర్ బిన్నీ, రాజీవ్ శుక్లా సెప్టెంబర్ 4న లాహోర్ చేరుకుంటారు. 7వ తేదీ వరకు ఉండి ఆసియాకప్ మ్యాచ్ లను వీక్షించనున్నారు. ‘‘తొలుత సెప్టెంబర్ 2న శ్రీలంకలో జరిగే భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ను చూసేందుకు బిన్నీ, రాజీవ్ శుక్లాతోపాటు, బీసీసీఐ సెక్రటరీ జైషా వెళ్లనున్నారు. అక్కడి నుంచి సెప్టెంబర్ 3న భారత్ చేరుకుంటారు. తిరిగి సెప్టెంబర్ 4న రోడ్డు మార్గంలో బిన్నీ, శుక్లా వాఘా సరిహద్దు ద్వారా లాహోర్ కు వెళతారు’’ అని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. లాహోర్ లోని గవర్నర్ హౌస్ లో సెప్టెంబర్ 4న వీరికి అధికారిక విందు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఆసియా కప్ మ్యాచ్ లు తొలుత పాకిస్థాన్ లో, ఆ తర్వాత శ్రీలంకలో జరగనుండడం తెలిసిందే.