Paritala Sunitha: గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టుగా ఆయన వ్యవహారం ఉంది: పరిటాల సునీత

  • దొంగ ఓట్లతో తొపుదుర్తి గెలిచారన్న పరిటాల సునీత
  • ఆయన కుటుంబ సభ్యులకు డబుల్ ఓట్లు ఉన్నాయని ఆరోపణ
  • ఓటర్ లిస్ట్ సర్వేకు వచ్చిన వారిపై బెదిరింపులకు పాల్పడుతున్నారని మండిపాటు
Paritala Sunitha challenge to Thopudurthi Prakash Reddy

రాప్తాడు ఎమ్మెల్యేగా తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి దొంగ ఓట్లతోనే గెలుపొందారని టీడీపీ నాయకురాలు, మాజీ మంత్రి పరిటాల సునీత ఆరోపించారు. దొంగ ఓట్లు, డబుల్ ఓట్లతో ఆయన గెలుపొందారని చెప్పారు. పచ్చి అబద్ధాలు చెపుతూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు కూడా డబుల్ ఓట్లు ఉన్నాయని అన్నారు. ప్రొద్దుటూరుకు చెందిన వారిని తోపుదుర్తి గ్రామంలో ఓటర్లుగా నమోదు చేశారని.. గత ఎన్నికల్లో కూడా ప్రొద్దుటూరుకు చెందిన వారు వాహనాల్లో తిరుగుతూ హడావుడి చేశారని దుయ్యబట్టారు. 

ఓటర్ లిస్ట్ సర్వేకు వచ్చిన వారిపై ఎమ్మెల్యే సోదరుడు బెదిరింపులకు దిగుతున్నారని పరిటాల సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. చనిపోయిన వారి ఓట్లను కూడా అలాగే ఉంచారని, వారి ఓట్లను వీరు వేసుకుంటారని చెప్పారు. తన ఊరిలో దొంగ ఓట్లు ఉన్నాయో... తోపుదుర్తిలో దొంగ ఓట్లు ఉన్నాయో చర్చకు తాను సిద్ధమని అన్నారు. గుమ్మడికాయ దొంగ అంటే తోపుదుర్తి భుజాలు తడుముకుంటున్నారని ఎద్దేవా చేశారు. 2019 ఎన్నికల్లో దొంగ ఓట్లు ఎక్కించిన తహసీల్దార్ లక్ష్మీనరసింహ వంటి వారికి తోపుదుర్తి బహుమతులు ఇచ్చిన సంగతి అందరికీ తెలుసని చెప్పారు. ఓటరు జాబితాలో తప్ప వారు ఎక్కడున్నారో బీఎల్ఓలకే తెలియదని అన్నారు.

More Telugu News