Jagan: రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖపై సీఎం జగన్ సమీక్ష... అధికారులకు కీలక ఆదేశాలు

  • వైద్య కళాశాలలు, ఆసుపత్రులపై అధికారులకు సీఎం జగన్ దిశానిర్దేశం
  • నిర్వహణకు నిధుల సమస్య రాకుండా చూడాలని ఆదేశం
  • అందుకోసం ఓ విధానం రూపొందించాలని స్పష్టీకరణ
CM Jagan held review meeting in state health and medical dept

ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఆసుపత్రుల నిర్వహణకు నిధుల సమస్య తలెత్తనివ్వకుండా చేసే విధానం తీసుకురావాలని సీఎం జగన్ అధికారులకు నిర్దేశించారు. ఇవాళ ఆయన రాష్ట్ర  వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని, రాష్ట్ర సీఎస్ జవహర్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి ఎమ్.టి.కృష్ణబాబు, సంబంధిత శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. 

ఈ సమావేశంలో సీఎం జగన్ మాట్లాడుతూ, ప్రభుత్వ రంగ వైద్య కళాశాలలు, ఆసుపత్రుల నిర్వహణ అత్యున్నత స్థాయిలో, లోపరహితంగా ఉండాలని స్పష్టం చేశారు. ఆయా విద్యాసంస్థలకు ప్రభుత్వం ఇచ్చే ఫీజు రీయింబర్స్ మెంట్ నిధుల్లోంచే కొంత సొమ్మును సదరు సంస్థల నిర్వహణకు ఉపయోగించేలా నూతన విధానం ఉండాలని సీఎం జగన్ వివరించారు. ఆసుపత్రులు, మెడికల్ కాలేజీల నిర్వహణకు నిధుల సమస్య రాకూడదని తెలిపారు. 

ఈ ఏడాది రాష్ట్రంలో రాజమండ్రి, విజయనగరం, నంద్యాల, మచిలీపట్నం, ఏలూరులోని మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు నిర్వహిస్తారని... మార్కాపురం, పులివెందుల, మదనపల్లె, ఆదోని, పాడేరులోని వైద్య కళాశాలల్లో వచ్చే ఏడాది నుంచి ప్రవేశాలు ఉంటాయని వివరించారు.

More Telugu News