Chandrayaan 3: చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతున్న ఇస్రో.. కోట్లాదిమంది ప్రార్థనలు

  • చంద్రయాన్-3 సక్సెస్ కోసం పూజలు
  • భారత్ సహా ప్రపంచ దేశాల్లో ఉత్కంఠ
  • సాయంత్రం లైవ్ స్ట్రీమింగ్ చేయనున్న ఇస్రో
A Billion Prayers As Chandrayaan 3 Attempts Moon Landing Today

చంద్రయాన్-3 ప్రాజెక్టు అత్యంత కీలక ఘట్టానికి చేరుకుంది. బుధవారం సాయంత్రం 6:04 గంటలకు జాబిల్లిపై విక్రమ్ ల్యాండర్ అడుగిడనుంది. రష్యా పంపించిన లూనా 25 స్పేస్ క్రాఫ్ట్ తో పాటు చంద్రయాన్-2 ప్రాజెక్టు చివరి క్షణంలో విఫలం కావడంతో ‘ఆ 20 నిమిషాల’పై దేశవిదేశాల్లోని శాస్త్రవేత్తలు టెన్షన్ గా ఎదురుచూస్తున్నారు. చివరి 20 నిమిషాల టెర్రర్ ను జయించి విక్రమ్ ల్యాండర్ క్షేమంగా జాబిల్లిని ముద్దాడాలని సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ఇస్రోకు అభినందనలు, ఆల్ ది బెస్ట్ చెబుతూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో చంద్రయాన్-3 ప్రాజెక్టు విజయవంతం కావాలని పూజలు జరుగుతున్నాయి. భారతీయులతో పాటు ప్రపంచ దేశాల చూపు మొత్తం ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 ప్రాజెక్టు పైనే కేంద్రీకృతమైంది.

విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై క్షేమంగా దిగుతుందని ఇస్రో శాస్త్రవేత్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 2019లో నిర్వహించిన చంద్రయాన్-2 ప్రాజెక్టు వైఫల్యం తర్వాత కారణాలను విశ్లేషించి, అప్పుడు జరిగిన పొరపాట్లకు మళ్లీ తావివ్వకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని చెబుతున్నారు. ఈసారి కచ్చితంగా జాబిల్లిని ముద్దాడి చరిత్ర సృష్టిస్తామని పేర్కొన్నారు. సాయంత్రం 5:20 గంటలకు ఇస్రో వెబ్ సైట్ తో పాటు ఇస్రో యూట్యూబ్ చానెల్, డీడీ నేషనల్ లో లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నట్లు వెల్లడించారు. చంద్రుడి దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్ దిగే అద్భుత క్షణాన్ని చూసేందుకు యావత్ దేశం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.

More Telugu News