Chandrababu Naidu: ఓటర్ల జాబితాలో అక్రమాలపై ఫిర్యాదు కోసం 28న ఢిల్లీకి చంద్రబాబు

  • ఓటర్ల జాబితాలో అవకతవకలపై ఫిర్యాదు చేయనున్న చంద్రబాబు
  • సున్నా డోర్ నంబరుతో లక్షలాది ఓట్లున్న వైనం ప్రధాన ఎన్నికల అధికారి దృష్టికి
  • విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరనున్న టీడీపీ అధినేత
  • అదే రోజు రాష్ట్రపతి భవన్‌లో జరిగే ఎన్టీఆర్ రూ. 100 నాణెం విడుదల కార్యక్రమానికి హాజరు
TDP chief Chandrababu to Delhi on 28th

ఓటర్ల జాబితాలో పెద్దఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపిస్తున్న ఏపీలోని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ నెల 28న ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఢిల్లీ వెళ్లనున్నారు. టీడీపీతోపాటు ఇతర ప్రతిపక్ష పార్టీల సానుభూతిపరుల ఓట్లను నిబంధనలకు విరుద్ధంగా తొలగించిన విషయాన్ని పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేయనున్నారు. 

అంతేకాదు, అధికార వైసీపీకి అనుకూలంగా ఒకే ఇంటి చిరునామాతో వందలాది నకిలీ ఓట్లను చేర్చిన విషయాన్ని ప్రధాన ఎన్నికల కమిషనర్ దృష్టికి తీసుకెళ్లనున్నారు. సున్నా డోర్ నంబరుతో లక్షలాది నకిలీ ఓట్లు ఉన్నాయని చెప్పనున్నారు. వీటిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు కోరనున్నారు. కాగా, ఎన్టీఆర్ చిత్రంతో కూడిన రూ.100 నాణేన్ని ఈ నెల 28న రాష్ట్రపతి విడుదల చేయనున్న నేపథ్యంలో రాష్ట్రపతి భవన్‌లో జరిగే కార్యక్రమంలోనూ చంద్రబాబు పాల్గొంటారు.

More Telugu News