Swati Maliwal: అత్యాచార బాధిత బాలికను కలవకుండా అడ్డుకున్న పోలీసులు.. ఆసుపత్రిలో నేలపైనే నిద్రించిన ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్

  • 17 ఏళ్ల బాలికపై ఢిల్లీ ప్రభుత్వాధికారి పలుమార్లు అత్యాచారం
  • గర్భస్రావం చేయించిన అధికారి భార్య
  • బాలికను కలిసేంత వరకు ఆసుపత్రి నుంచి కదిలేది లేదన్న స్వాతి మాలీవాల్
Delhi Women panel chief Swati Maliwal sleeps at hospital

అత్యాచార బాధిత బాలిక(17), ఆమె తల్లిని కలవకుండా పోలీసులు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మాలీవాల్.. బాధితురాలు చికిత్స పొందుతున్న ఆసుపత్రి ప్రాంగణంలో నేలపైనే నిద్రించారు. పోలీసులు తనతో దురుసుగా ప్రవర్తించారని, బాధిత బాలికను కానీ, ఆమె తల్లిని కానీ కలుసుకునేందుకు అంగీకరించడం లేదని ఆరోపించారు. తన నుంచి వారు ఏం దాచడానికి ప్రయత్నిస్తున్నారో తనకు అర్థం కావడం లేదన్నారు. బాధిత బాలికను కలిసేందుకు తనను అనుమతించాల్సిందిగా బాలల హక్కుల కమిషన్ (ఎన్సీపీసీఆర్)ను కోరినట్టు తెలిపారు. 

ఎన్సీపీసీఆర్ చీఫ్ బాధిత బాలిక తల్లిని కలిసినప్పుడు తననెందుకు అడ్డుకుంటున్నారని స్వాతి ప్రశ్నించారు. నిన్న మధ్యాహ్నం నుంచీ ఆసుపత్రిలోనే ఉన్న ఆమె బాధితురాలిని కలిశాకే అక్కడి నుంచి కదులుతానని స్పష్టం చేశారు. కాగా, ఢిల్లీ ప్రభుత్వంలోని మహిళా, శిశు అభివృద్ది విభాగం డిప్యూటీ డైరెక్టర్ ప్రేమోదయ్ ఖాఖా బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. బాలిక గర్భం దాల్చడంతో నిందితుడి భార్య సీమా రాణి ఆమెకు గర్భనిరోధక మాత్రలు వేసి గర్భంస్రావం చేసినట్టు బాధిత బాలిక పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ కేసులో ఖాఖా ఆమె భార్యను అరెస్ట్ చేసిన పోలీసులు పశ్నిస్తున్నారు.

More Telugu News