కామారెడ్డి, గజ్వేల్ నుండి కేసీఆర్ పోటీ.. 115 నియోజకవర్గాల బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా ఇదిగో

KCR to contest from Kamareddy and Gajwel
  • ఏడు స్థానాల్లో సిట్టింగ్‌లకు చేయి
  • పెండింగ్‌లో నాలుగు స్థానాలు
  • జనగామ, నర్సాపూర్, నాంపల్లి, గోషామహల్ అభ్యర్థులను ప్రకటించని కేసీఆర్
  • 115 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్
తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 115 నియోజకవర్గాలకు పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. సోమవారం ఆయన బీఆర్ఎస్ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... కేవలం నాలుగు నియోజకవర్గాలను మాత్రమే పెండింగ్‌లో పెట్టినట్లు చెప్పారు. వివిధ కారణాల వల్ల ఏడు స్థానాల్లో మాత్రమే సిట్టింగ్‌లను మార్చినట్లు చెప్పారు. ఇక కేసీఆర్ కామారెడ్డి, గజ్వేల్ నుండి పోటీ చేయనున్నారు.

2023 ఎన్నికలకు ఆరేడుగురు సిట్టింగ్‌లను మాత్రమే తప్పించామని, అందులోను బాగా పని చేసే అభ్యర్థులు కూడా ఉన్నారని చెప్పారు. ఉదాహరణకు వేములవాడ అభ్యర్థి చెన్నమనేని రమేశ్ పౌరసత్వం నేపథ్యంలో ఆయనకు టిక్కెట్ ఇవ్వడం లేదన్నారు. మొత్తానికి పెద్దగా మార్పులు, చేర్పులు లేవన్నారు. బోథ్, అసిఫాబాద్, హైదరాబాద్‌లోని ఉప్పల్, కోరుట్లలో మాత్రమే మార్పులు చేసినట్లు చెప్పారు. ఎన్నికలు అంటే ఇతర పార్టీలకు రాజకీయమని విమర్శించారు. గుజరాత్, మహారాష్ట్రలను తలదన్నేలా తెలంగాణ అభివృద్ధి చెందిందన్నారు. 24 గంటల విద్యుత్ ఇస్తున్నది దేశంలో ఒక్క తెలంగాణ మాత్రమేనని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో కర్ణాటకలో తెలిసిపోయిందన్నారు.

తెలంగాణలో మజ్లిస్ పార్టీ, బీఆర్ఎస్ కలిసి ముందుకు సాగుతున్నాయన్నారు. మజ్లిస్, తాము కలిసి ఉమ్మడి హైదరాబాద్‌లో 29 సీట్లకు ఇరవై తొమ్మిది తామే గెలుస్తామన్నారు. బీఆర్ఎస్ ప్రకటించిన అభ్యర్థులను మనస్పూర్తిగా స్వీకరించి, అందర్నీ గెలిపించాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ వచ్చే ఎన్నికల్లో 95 నుండి 105 సీట్లలో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జనగామ, నాంపల్లి, గోషామహల్, నర్సాపూర్ నియోజకవర్గాలను పెండింగ్‌లో ఉంచినట్లు చెప్పారు.
Go Back to Shorts
KCR
Telangana Assembly Election
BJP
BRS
Congress

More Telugu News