Ashwini Vaishnaw: రఘురాం రాజన్ ఆర్థికవేత్తగా కంటే రాజకీయాల్లోకి వచ్చి పోటీ చేయాలి: కేంద్రమంత్రి చురక

  • రఘురాం రాజన్ ఎవరి తరఫునో షాడో బాక్సింగ్ చేస్తున్నారని వ్యాఖ్య
  • రఘురాం రాజన్‌పై కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ ఆగ్రహం
  • ఆర్థికవేత్తలు రాజకీయ నాయకులుగా మారితే ఆర్థిక స్పృహ కోల్పోతారన్న వైష్ణవ్
  • అతను రాజకీయాల్లోకి వచ్చి, ఎన్నికల్లో పోటీ చేయాలని సూచన
Raghuram Rajan is doing shadow boxing on someones behalf Ashwini Vaishnaw

ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్‌పై కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఎవరి తరఫునో రాజన్ షాడో బాక్సింగ్ చేస్తున్నాడని చురకలు అంటించారు. పీఎల్ఐ కింద భారత్ ఫోన్‌లను తయారు చేయడం లేదని, కేవలం అసెంబ్లింగ్ చేస్తోందని రఘురాం రాజన్ విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి తీవ్రంగా స్పందించారు. మంచి ఆర్థికవేత్తలుగా ఉన్నవారు రాజకీయ నాయకులుగా మారిపోతే వారు తమ ఆర్థిక స్పృహను కోల్పోతారని ఎద్దేవా చేశారు. 

రఘురాం రాజన్ ఇప్పుడు మంచి రాజకీయ నాయకుడు అయ్యాడని చురకలు అంటించారు. ఇప్పుడు అతను రాజకీయంగా బయటకు రావాలని, ఎన్నికల్లో పోటీ చేయాలని, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనాలన్నారు. అంతేకాదు ఎవరి తరఫునో షాడో బాక్సింగ్ చేయడం మంచిది కాదన్నారు. ఇప్పుడు రఘురాం మరొకరి తరఫున బాక్సింగ్ చేస్తున్నాడన్నారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ.. రానున్న రెండేళ్లలో ఎలక్ట్రానిక్స్ తయారీలో భారత్ 30 శాతానికి పైగా అదనపు వ్యాల్యూను జత చేస్తుందన్నారు. త్వరలో మూడు కంపెనీలు ముఖ్యమైన మొబైల్ ఫోన్ భాగాలను మ్యానుఫ్యాక్చరింగ్ చేయనున్నాయన్నారు. ఉత్పత్తి క్రమంగా ముందుకు సాగుతుందన్నారు. రఘురాం రాజన్ మాత్రం షాడో బాక్సింగ్ చేస్తున్నారని, అతను ఉంటే మంచి ఆర్థికవేత్తగా ఉండిపోవాలని లేదా మంచి రాజకీయ నాయకుడిగా మారిపోవాలని తాను కోరుతున్నానని చెప్పారు. కాగా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో రాజస్థాన్‌లో రఘురాం రాజన్ కూడా పాల్గొన్నారు.

More Telugu News