Kurnool District: భార్యపై అనుమానంతో 4 ఏళ్ల కొడుకుకు పురుగుల మందు తాగించి, తనూ తాగేసిన భర్త.. ఇద్దరూ మృతి

  • కర్నూలు జిల్లా దేవనకొండలో గురువారం వెలుగు చూసిన ఘటన
  • 14 ఏళ్ల క్రితం మహిళకు వివాహం, అయిదేళ్లుగా భర్తకు దూరంగా పుట్టింట్లో ఉంటున్న మహిళ
  • భార్యకు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో రగిలిపోయిన భర్త
  • గురువారం భార్య ఇంటికొచ్చి కుమారుడికి బలవంతంగా పురుగుల మందు తాగించిన వ్యక్తి
  • ఆపై తనూ పురుగుల మందు తాగి కుప్పకూలిన వైనం
  • తండ్రీకొడుకులను స్థానికులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే వారు మృతి చెందినట్టు వెల్లడి
Man suspects his wife having an affair kills their four year old son before committing suicide

భార్యపై అనుమానంతో ఉన్మాదిలా మారిన ఓ వ్యక్తి చివరకు కన్న కొడుకునే బలితీసుకుని, తనూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కర్నూలు జిల్లా దేవనకొండలో తాజాగా వెలుగు చూసిన ఈ ఉదంతం స్థానికంగా కలకలం రేపుతోంది. బనగానపల్లి మండలం పెద్దరాజుపల్లి గ్రామానికి చెందిన అరసాని రాజు(44) సుమారు 14 ఏళ్ల అనిత అనే యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు కుమారులు. ఆ తరువాత భార్యాభర్తల మధ్య వివాదం తలెత్తడంతో ఆమె తన బిడ్డలను తీసుకుని దేవనకొండలోని తల్లివద్దకు వచ్చేసింది. ప్రైవేటు స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తూ బిడ్డలను పెంచుకుంటోంది. అయితే, ఆమె మరొకరితో వివాహేతర సంబంధం కారణంగానే తన వద్దకు రావట్లేదని భర్త రాజు అనుమానంతో రిగిలిపోయేవాడు.

ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున అతడు భార్య ఇంటికి పురుగులమందు, వేటకోడవలితో వెళ్లాడు. తండ్రి తీరు చూసి హడలిపోయిన పెద్దకుమారుడు వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. మరోవైపు, ఇంట్లో పడుకుని ఉన్న చిన్నకుమారుడు ఉజ్వల్‌కు రాజు బలవంతంగా తనతో తెచ్చుకున్న పురుగుల మందు తాగించడంతో అతడు అచేతన స్థితిలోకి వెళ్లిపోయాడు. ఆ తరువాత రాజు కొడవలి పట్టుకుని వీధిలోకి వచ్చి నానా యాగీ చేశాడు.

 ‘‘కలిసి జీవిద్దామని నా భార్యకు ఎన్నిసార్లు చెప్పినా వినలేదు. వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుంది’’ అంటూ పెద్దపెట్టున అరుస్తూ స్థానికులను భయభ్రాంతులకు గురి చేశాడు. ఈ క్రమంలో తనూ పురుగులమందు తాగి కుప్పకూలిపోయాడు. స్థానికులు తండ్రీకొడుకులను ఆసుపత్రికి తరలించగా వారు అప్పటికే మరణించినట్టు వైద్యులు ప్రకటించారు. విగతజీవిగా మారిన కుమారుడిని చూసి అనిత కన్నీరుమున్నీరైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

More Telugu News