USA: భార్యను తుపాకీతో కాల్చి చంపేసిన అమెరికా న్యాయమూర్తి

  • కాలిఫోర్నియాలోని ఆరెంజ్ కౌంటీలో ఘటన
  • ఆగస్టు 3న రెస్టారెంట్‌కు వెళ్లిన న్యాయమూర్తి, ఆయన భార్య
  • రెస్టారెంట్‌లో మొదలై, ఇంటికొచ్చాక కూడా కొనసాగిన భార్యాభర్తల వాగ్వాదం 
  • చేతిని తుపాకీలా చూపుతూ భయపెడుతున్న భర్తను నిజమైన తుపాకీ గురిపెట్టమన్న భార్య
  • మద్యం మత్తులో న్యాయమూర్తి విచక్షణ కోల్పోయి భార్యపై కాల్పులు, మహిళ దుర్మరణం
  • ఈ ఘటనపై కోర్టులో విచారణ, ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యాయమూర్తికి బెయిలు
US Judge Shoots Wife Dead Tells Cops Im Done For A While

అమెరికాలో ఓ న్యాయమూర్తి తాగిన మైకంలో తన భార్యను కాల్చి చంపేశారు. ఆ తరువాత కోర్టు ఉద్యోగికి మెసేజ్ చేసి తాను రేపు న్యాయస్థానానికి రాలేనని చెప్పారు. కాలిఫోర్నియా రాష్ట్రంలో ఈ దారుణం వెలుగు చూసింది. ఇటీవల జరిగిన ఈ ఘటనపై మంగళవారం స్థానిక న్యాయస్థానంలో విచారణ జరిగింది.

పూర్తి వివరాల్లోకి వెళితే, ఆరెంజ్ కౌంటీ సుపీరియర్ కోర్టులో న్యాయమూర్తిగా ఉన్న జెఫ్రీ ఫెర్గ్యుసన్(72) ఆగస్టు 3న తన భార్యతో కలిసి అనహైమ్ ప్రాంతంలోని ఓ ఖరీదైన రెస్టారెంట్‌కు వెళ్లారు. అక్కడ డిన్నర్ చేస్తుండగా భార్యాభర్తల మధ్య వాగ్యుద్ధం మొదలైంది. ఈ క్రమంలో చేతిని తుపాకీలాగా చూపిస్తూ భార్యను జెఫ్రీ బెదిరించారు. ఆ తరువాత వారిద్దరూ ఇంటికి చేరుకున్నారు. ఈ క్రమంలో న్యాయమూర్తి భార్య షెరిల్(65)..‘‘నువ్వోసారి నిజమైన గన్నును నాపై గురిపెట్టు’’ అని సవాలు విసిరింది. అప్పటికే మద్యం మైకంలో ఉన్న న్యాయమూర్తి మరో ఆలోచన లేకుండా తన వద్ద ఉన్న తుపాకీ బయటకు తీసి భార్యను ఛాతిపై కాల్చడంతో ఆమె కుప్పకూలిపోయింది. 

ఆ తరువాత జడ్జి ఎమర్జెన్సీ నెంబర్‌కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. ‘‘మీరే ఆమెను కాల్చారా?’’ అని అవతలివైపు వ్యక్తి ప్రశ్నించగా తానిప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పదలుచుకోలేదని జడ్జి బదులిచ్చారు. ఆ తరువాత ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు న్యాయమూర్తి ఇంట్లో కొన్ని గన్నులు, భారీగా బుల్లెట్లు లభ్యమయ్యాయి. పోలీసులు వచ్చే లోపు న్యాయమూర్తి కోర్టు సిబ్బందికి ఒకరికి మెసేజ్ చేశారు. ‘‘నేను అనుకోకుండా కంట్రోల్ తప్పా. నా భార్యపై కాల్పులు జరిపా. నేను రేపు కోర్టుకు రాలేను. పోలీసుల అదుపులో ఉంటా. ఇక నా పని అయిపోయింది’’ అని మెసేజ్ చేశారు. 

అయితే, ఇది ప్రమాదవశాత్తూ జరిగిందా? లేక దురుద్దేశంతో కూడుకున్నదా? అని తాము స్పష్టంగా తేల్చుకోవాలని ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నారు. మంగళవారం కోర్టు జడ్జిని బెయిల్‌పై విడుదల చేసింది. మళ్లీ అక్టోబర్ 30న ఆయన విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.

More Telugu News