బీఎస్పీ కార్యకర్తలపై దాడులకు దిగితే ఇక ఊరుకునేది లేదు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
- బెల్లంపల్లిలో బీఎస్పీ ఇన్చార్జిపై దాడి
- బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వర్గీయులే దాడి చేశారన్న ప్రవీణ్ కుమార్
- తమపై దాడి చేస్తే ప్రగతి భవన్ ను ముట్టడిస్తామని హెచ్చరిక
బీఎస్పీ కార్యకర్తలపైనా, నేతలపైనా దాడులు చేస్తే ఇక ఊరుకునేది లేదని, ప్రగతి భవన్ ను కచ్చితంగా ముట్టడిస్తామని ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో తమ నేతపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, తెలంగాణ ప్రజలపై ఏమాత్రం ప్రేమ ఉన్నా హోంమంత్రిని వెంటనే తొలగించాలని సీఎం కేసీఆర్ ను ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.
దాడి కేసు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన బెల్లంపల్లి పోలీసులపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. పోలీసుల వ్యవహారశైలి అధికార పక్షానికి కొమ్ముకాసే విధంగా ఉందని ఆరోపించారు. బాధితుడే నిందితుడయ్యాడని... దాడికి పాల్పడినవారిని వదిలేసి, బాధితుడిపైనే ఆరోపణలు చేస్తున్నారని ప్రవీణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.