Varla Ramaiah: జగన్‌పై తీవ్రవ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత వర్ల రామయ్య

  • ఏపీలో పట్టపగలే దళిత మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్న రామయ్య 
  • దళితులను చంపినా, నరికినా, అత్యాచారం చేసినా ప్రభుత్వం స్పందించడం లేదని ఆరోపణ
  • జగన్ మౌనం చూస్తుంటే పరోక్షంగా వీటిని ప్రోత్సహిస్తున్నారా? అనే అనుమానం వస్తోందని వ్యాఖ్య
  • కల్యాణదుర్గం ఘటన మీద పోలీసుల తీరుపై ఆగ్రహం
Varla Ramaiah hot comments on YS Jagan

ఏపీలో పట్టపగలే దళిత మహిళలకు రక్షణ లేకుండా పోయిందని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. దళితులపై దాడులు చేసినవారికి అవార్డులు, రివార్డులు ఏమైనా ఇస్తున్నారా? అనే అనుమానం కలుగుతోందన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... వైసీపీ ప్రభుత్వంలో దళితులకు రక్షణ కరవైందని, దాడులు పెరిగాయన్నారు. దళితులను చంపినా, నరికినా, శిరోముండనం చేసినా, అత్యాచారాలు చేసినా ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి చీమకూడా కుట్టినట్లు లేదన్నారు.

జగన్ మౌనం చూస్తుంటే పరోక్షంగా వీటిని ప్రోత్సహిస్తున్నారా? అనే అనుమానం వస్తోందన్నారు. దళితులపై జరుగుతున్న దాడుల గురించి పత్రికల్లో వస్తున్నా చర్యలు శూన్యమన్నారు. ఈ దాడులపై ముఖ్యమంత్రి ఒక్కసారైనా డీజీపీ, పోలీసులు, కలెక్టర్లను పిలిచి సమీక్షించారా? అని నిలదీశారు. కల్యాణదుర్గంలో మాదిగ కులానికి చెందిన ఓ మహిళపై వైసీపీకి చెందిన ఐదుగురు ఏళ్లుగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని వాపోయారు.

ఏళ్లుగా ఇలా జరుగుతుంటే పోలీసులు దానిని చిన్న ఫిర్యాదుగా చెప్పడం సిగ్గుచేటన్నారు. ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున స్వాతంత్ర్యం కోల్పోయిన దళిత బిడ్డకు సీఎం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జగన్ దళితులకు మేనమామ కాదు.. కంసమామ.. దొంగమామ అని ధ్వజమెత్తారు. దళితులు వారి పట్ల రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారశైలిని గమనించాలన్నారు. దళితులపై జరుగుతున్న దాడుల పట్ల ముఖ్యమంత్రి ఒక ప్రకటన చేయాలన్నారు.

More Telugu News