Rahul Gandhi: కూరగాయల విక్రేతతో కలిసి భోజనం చేసిన రాహుల్ గాంధీ

  • ఢిల్లీ ఆజాద్ పూర్ మండీలో టమాటాలు కొనేందుకు వెళ్లిన రామేశ్వర్
  • రామేశ్వర్ ఒక తోపుడుబండి కూరగాయల విక్రేత
  • టమాటాల ధరలు చూసి కొనకుండానే వెనుదిరిగిన వైనం
  • రామేశ్వర్ ఏడుస్తూ మాట్లాడిన వీడియో వైరల్
  • రాహుల్ దృష్టిలో పడిన రామేశ్వర్
Rahul Gandhi dines with vegetables vendor

ఇటీవల లారీలో ప్రయాణించి, డ్రైవర్లతో కలిసి భోజనం చేసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ... ఈసారి ఓ కూరగాయల విక్రేతతో కలిసి భోజనం చేశారు. ఆ తోపుడుబండి కూరగాయల విక్రేత పేరు రామేశ్వర్. 

ఇటీవల ఢిల్లీలోని ఆజాద్ పూర్ మండీలో పెద్దసంఖ్యలో టమాటాలు కొనేందుకు వచ్చిన రామేశ్వర్... అక్కడి ధరలు చూసి టమాటాలు కొనలేకపోయాడు. టమాటాల ధరలు చూసి అతడు కన్నీటి పర్యంతమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

దాంతో రామేశ్వర్ ను కలుసుకునేందుకు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆజాద్ పూర్ మండీకి వెళ్లారు. ఆ సమయంలో రామేశ్వర్ అక్కడ లేడు. ఆ తర్వాత తనకోసం రాహుల్ వచ్చిన విషయాన్ని తెలుసుకున్న ఆ కూరగాయాల విక్రేత ఉబ్బితబ్బిబయ్యాడు. తనకు రాహుల్ ను కలుసుకోవాలనుందని చెప్పాడు. 

ఈ నేపథ్యంలో, రాహుల్ గాంధీ... కూరగాయల విక్రేత రామేశ్వర్ ను తన నివాసానికి పిలిపించారు. అతడితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అంతేకాదు, డైనింగ్ టేబుల్ పై అతడితో కలిసి భోజనం చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి.

More Telugu News