Group-2: తెలంగాణలో గ్రూప్-2 పరీక్షల రీషెడ్యూల్ ఖరారు

  • తెలంగాణలో గ్రూప్-2 పరీక్షల వాయిదా
  • నవంబరు 2, 3 తేదీల్లో పరీక్షల నిర్వహణ
  • వారం రోజుల ముందు ఆన్ లైన్ లో హాల్ టికెట్లు
Group 2 exams reschedule finalized in Telangana

తెలంగాణలో గ్రూప్-2 పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో గ్రూప్-2 పరీక్షల రీషెడ్యూల్ ను తాజాగా ఖరారు చేసింది. నవంబరు 2, 3 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు నిర్వహించనుంది. పరీక్షకు వారం రోజుల ముందు హాల్ టికెట్లను ఆన్ లైన్ లో డౌన్ లోడ్ చేసుకోవచ్చు. 

వరుసగా పోటీ పరీక్షలు నిర్వహిస్తుండడంతో, తాము ఏ పరీక్షలకూ సరిగా సన్నద్ధం కాలేకపోతున్నామని తెలంగాణలోని నిరుద్యోగ అభ్యర్థులు వాపోతున్నారు. అందుకే గ్రూప్-2 పరీక్షలను మూడు నెలలు వాయిదా వేయాలని గత కొంతకాలంగా పోరాడుతున్నారు. ఇటీవల టీఎస్ పీఎస్ సీ ముట్టడి కూడా చేశారు. ఈ సందర్భంగా ఉద్రిక్తతలు నెలకొన్నాయి. 

ఈ పరిస్థితుల నేపథ్యంలో, సీఎం కేసీఆర్ రాష్ట్ర సీఎస్ శాంతికుమారికి ఆదేశాలు ఇచ్చారు. టీఎస్ పీఎస్ సీతో చర్చించి గ్రూప్-2 పరీక్షల నిర్వహణపై నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేశారు. సీఎం ఆదేశాలతో టీఎస్ పీఎస్ సీ వర్గాలతో శాంతికుమారి చర్చలు జరిపారు. అనంతరం, గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. 

వాస్తవానికి, ముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం గ్రూప్-2 పరీక్షలు ఆగస్టు 29, 30 తేదీల్లో నిర్ణయించాల్సి ఉంది.

More Telugu News